మద్దూరు : దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతుంటే రేవంత్రెడ్డి, బండి సంజయ్లు పాదయాత్రల పేరిట విహారయాత్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విమర్శించారు. బుధవారం మండలంలోని లద్నూర్ రిజర్వాయర్లో ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి, చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్తో కలిసి చేప పిల్లలను వదిలారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగార్జునసాగర్లో సీనియర్ నాయకుడైన జానారెడ్డిని యువకుడైన భగత్ ఎలా ఓడించారో హుజురాబాద్లో రాజేందర్ను గెల్లు శ్రీనివాస్ యాదవ్ అదే మాదిరిగా ఓడించడం ఖాయమన్నారు.
ఈటల రాజేందర్ మంత్రిగా ఆస్తులను కూడబెట్టుకున్నాడని, హుజురాబాద్కు ఆయన చేసింది శూన్యమన్నారు. సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు అన్నారు. దేవాదుల ప్రాజెక్టును 14 ఏండ్లు నిర్మించారని, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం మూడేండ్లలో నిర్మించి మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయక్సాగర్ ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగు నీరందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి లక్షల కోట్ల రూపాయలు తీసుకుంటుందని, రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాను అందించడం లేదన్నారు.
అంతకుముందు రిజర్వాయర్ వద్ద ఎమ్మెల్యే మొక్కలు నాటారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి మధుసూదన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేక సంతోశ్కుమార్, మంద యాదగిరి, వైస్ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు వంగ భాస్కర్రెడ్డి, చొప్పరి వరలక్ష్మిసాగర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, స్థానిక సర్పంచ్ జీడికంటి సుదర్శన్, ఎంపీటీసీ గుజ్జుక సమ్మయ్య, నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, మత్స్యకార సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.