కమలాపూర్ రూరల్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో గెలిపించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అండగా నిలువాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గూడూరు గ్రామంలో మాదన్నపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లి ప్రచారం చేయాలని సూచించారు.
ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇస్తున్నారని, గెల్లు గెలుపు ఖాయమైందని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లును గెలిపించి కేసీఆర్కు కానుకగా పంపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఇంద్రాసేనారెడ్డి, గోపాల్పూర్ సర్పంచ్ గోపాల్, నాయకులు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.