హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గా ఉప ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోరారు. గురువారం ఆయన హుజురాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి, కందు గుల, పెద్ద, చిన్న పాపయ్య పల్లి గ్రామాల్లో ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్రావుతో కలిసి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా గెల్లు మాట్లాడుతూ పేదవాడిని ఆదరించండి, హుజూరాబాద్ లోనే ఉండి అభివృద్ధి చేస్తా. పేదలకు సీఎం కేసీఆర్ నుండి 5 వేల ఇండ్లు తెచ్చి నిర్మించి ఇస్తా! వైద్యం కోసం మెడికల్ కళాశాల మంజూరుకు కృషి చేస్తానని అన్నా రు. “నాకు భూములు, జాగలు లేవు… కోళ్లఫారాలు లేవు.. ఆస్తులు లేవు.. అంతస్తులు లేవు.. ఒక్క ఫోన్ కాల్ చేస్తే.. మీ గడపలో వాలిపోతా.. మీకు సేవ చేస్తా.. నాకు మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి అని గెల్లు ఉద్వేగంగా మాట్లాడారు.
తెలంగాణ కోసం పోరాటం చేస్తే 130 కేసులు తనపై నమోదయ్యాయని, వందలాది రోజులు జైలు జీవితం గడిపిన ఉద్యమకారుడినని, నిజమైన బీసీ బిడ్డను అని గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యేలు వొడితల సతీష్ కుమార్, గువ్వల బాల రాజు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎంపీపీ ఈరుమల్ల రాణి, జడ్పీటీసీ పడిదం బక్కరెడ్డి, పార్టీ అధ్యక్షుడు సంగెం ఐలెయ్య, ఎడవెల్లి కొండల్ రెడ్డి, చోల్లేటి కిషన్ రెడ్డి, విజయారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, టీఆరెస్ నాయకులు, ప్రజ్రప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో మంత్రి హరీష్ రావుకు, అభ్యర్థి గెల్లుకు అపూర్వ స్వాగతం
హుజురాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి, కందుగుల, పెద్ద, చిన్న పాపయ్య పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి తన్నీరు హరీష్ రావు, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ లకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మంగళ హారతులతో స్వాగతం పలికారు.
హరీష్ రావు వస్తున్నారని తెలిసి ప్రజలు ఇండ్లకు తాళాలు వేసి పిల్ల పాపలతో సభల్లో పాల్గొన్నారు. గ్రామాల్లో యూత్ సభ్యులు పూల వర్షం కురిపించారు. మహిళలు మంగళ హారతులతో ముంచెత్తారు. హరీష్ రావు ప్రసంగం పలువురి ని ఆకట్టుకుంది. ముఖ్యంగా రైతులను ఆకట్టుకునే విధంగా మంత్రి ప్రసంగించారు.