మిలన్: పండుగ పూట ప్రయాణికులకు దేశీయ విమానాయన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) షాకిచ్చింది. కుటుంబ సభ్యులతో దీపావళి (Diwali) వేడుకల్లో పాల్గొందామనుకున్న ప్రవాస భారతీయులకు నిరాశ మిగిల్చింది. సాంకేతిక కారణాలతో చివరి క్షణంలో విమానానాన్ని రద్దు (Flight Cancel) చేసింది. దీపావళి పండుగకు ఇటలీలో ఉంటున్న వందలాది మంది భారతదేశానికి వద్దామనకున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు చెందిన మిలన్ నుంచి ఢిల్లీ వెల్లాల్సిన ఏఐ138 విమానంలో టికెట్లు బుక్చేసుకున్నారు. అయితే శుక్రవారం (అక్టోబర్ 17న) మిలాన్ నుంచి బయల్దేరాల్సిన విమానం సాంకేతిక కారణాలతో రద్దయిందని సంస్థ ప్రకటించింది. తదుపరి విమానం సోమవారం(దీపావళి) లేదా మంగళవారం బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా చెప్పడంతో వారంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు.
‘ఎయిర్ ఇండియా.. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యతనిస్తుందని, షెడ్యూల్ చేసిన విమానంలో సాంకేతిక సమస్య కారణంగా కారణంగా.. 2025, అక్టోబర్ 17న మిలన్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ 138 విమానం రద్దు అయ్యింది’ అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ విమానంలో ఎక్కాల్సిన ప్రయాణికులకు హోటల్ వసతి కల్పించామని, విమానాశ్రయం సమీపంలోనే వారికి ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఎయిర్ ఇండియాతో పాటు ఇతర విమానయాన సంస్థలతో సీట్ల లభ్యత ఆధారంగా 2025, అక్టోబర్ 20 లేదా ఆ తర్వాత ప్రత్యామ్నాయ విమానాలలో ప్రయాణికులు తిరిగి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఇక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులందరికీ భోజనంతో సహా అవసరమైన అన్ని సహాయాలను ఎయిర్ ఇండియా అందిస్తుంది. వారికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రయాణికులు, సిబ్బంది భద్రతపై ఎయిర్ ఇండియా నిబద్ధత కలిగివుంటుందని పునరుద్ఘాటిస్తున్నాం’ అని పేర్కొన్నారు.