శ్రీశైలం : అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా కనిపించాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకొని.. అనంతరం స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు.
శ్రీఘ్ర, వీఐపీ, వీఐపీ బ్రేక్ టికెట్లు తీసుకున్న భక్తులకు స్పర్శ దర్శనం కల్పించారు. సామాన్య భక్తులకు అలంకార దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నవారు స్వామిఅమ్మవార్ల సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం భక్తులు గుమిగూడకుండా అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టారు.
క్యూలైన్లలో భక్తులకు అల్పాహారం, మంచినీరు. మజ్జిగ అందజేసినట్లు ఏసీ నటరాజ్ తెలిపారు. అదే విధంగా క్లాక్ రూం, ప్రసాద విక్రయ కేంద్రాలు, ఫ్రీ క్యూలైన్లలో పర్యటించి, యాత్రికులతో ఈవో లవన్న మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ భద్రతను దృష్టిలో పెట్టుకొని భక్తులు సెల్ఫోన్లు లోనికి తేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు.