హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో గృహ విక్రయాలు అంతకంతకు పెరుగుతున్నాయి. గత నెలలో 6,414 యూనిట్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీలు అమ్ముడయ్యాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తాజాగా వెల్లడించింది. వీటి విలువ రూ.3,352 కోట్ల స్థాయిలో ఉంటుందని పేర్కొంది. ఫిబ్రవరిలో నమోదైన విక్రయాలతో పోలిస్తే 12 శాతం పెరిగాయని తెలిపింది. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో 53 శాతం ఇళ్ల ధరలు రూ.25-50 లక్షల లోపు ఉన్నాయని తెలిపింది. అలాగే 1,000-2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మధ్యస్థాయి గృహాలు అధికంగా ఉన్నాయని పేర్కొంది.
అదే విధంగా మధ్యతరగతి, అధిక విస్తీర్ణం కలిగిన ఇళ్లకు కూడా డిమాండ్ పెరిగిందని, రూ.50 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన గృహాలు 29 శాతం వాటా కలిగివున్నాయని తెలిపింది. హైదరాబాద్తోపాటు మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి వంటి నాలుగు జిల్లాల పరిధిలోని గృహాల విక్రయాలు అత్యంత కీలకమని నైట్ఫ్రాంక్ ఇండియా బ్రాంచ్ డైరెక్టర్ శ్యాంసన్ ఆర్థర్ తెలిపారు.