షిమ్లా : హిమాచల్ప్రదేశ్లో ప్రకృతి వైపర్యీతాలు, ప్రమాదాల కారణంగా గత నెల 13 నుంచి ఆదివారం వరకు సుమారు 187 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గల్లంతవగా.. ఇప్పటి వరకు రూ.401 కోట్ల ఆస్తినష్టం జరిగిందని అధికారులు తెలిపారు. అలాగే జూన్ 21 నుంచి 381 జంతువులు సైతం మృత్యువాతపడ్డాయని హిమాచల్ప్రదేశ్ డైరెక్టర్ కం స్పెషల్ సెక్రెటరీ (రెవెన్యూ మేనేజ్మెంట్) సుదేశ్ కుమార్ మోక్త పేర్కొన్నారు. బాట్సేరి, చిత్కుల్ ప్రాంతం సహా 28 రోడ్లను మూసివేసినట్లు చెప్పారు. కిన్నౌర్ జిల్లాలోని చిత్కుల్ ప్రాంతంలో సుమారు 90 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు.
ఆ ప్రాంతంలో నిరంతరం కొండచరియలు విరిగిపడుతుండడంతో రోడ్ల పునరుద్ధరణ సాధ్యం కావడం లేదని పేర్కొన్నారు. గత నెల 13 తర్వాత కాంగ్రా, బాట్సేరిలో రెండు ప్రమాదాలు సహా పలు సంఘటనలు జరిగాయని చెప్పారు. ఆయా ఘటనల్లో 187 మంది మృత్యువాతపడగా.. మరో నలుగురు ఆచూకీ తెలియడం లేదని సుదేష్కుమార్ మోక్త పేర్కొన్నారు. వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 381 జంతువులు చనిపోయాయని పేర్కొన్నారు. ఆదివారం నాటికి మొత్తం రూ.401 ఆస్తినష్టం జరిగినట్లు పేర్కొన్నారు.
కిన్నౌర్ జిల్లాలో ఆదివారం కొండచరియలు విరిగిపడగా.. తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు. బండరాళ్లపై పడడంతో వంతెన సైతం కూలిపోయింది. ఈ క్రమంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన ముగ్గురు సభ్యుల బృందం మంగళవారం నుంచి సాంగ్లాలో పర్యటిస్తుందని తెలిపారు. కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలను అధ్యయనం చేసేందుకు పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని విపత్తు నిర్వహణ అథారిటీ యోచిస్తోందని చెప్పారు.