Banana Flower | అరటి పండ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. కనుక అరటి పండ్లను చాలా మంది తింటుంటారు. అయితే కేవలం అరటి పండ్లే కాదు, అరటి పువ్వులు కూడా మనకు మేలు చేస్తాయి. అరటి పువ్వులను కూరగా చేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. మన దేశంతోపాటు పలు ఆసియా దేశాలకు చెందిన వారు అరటి పువ్వును కూడా వంటల్లో ఉపయోగిస్తుంటారు. దీని వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. అలాగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అరటి పువ్వులో అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మనల్ని రోగాల నుంచి రక్షిస్తాయి. శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
అరటి పువ్వులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకం తగ్గేలా చేస్తుంది. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. ఇది జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం తక్కువగా తింటారు. దీని వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది. అరటి పువ్వులో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు, టానిన్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ ను తొలగిస్తాయి. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. అరటి పువ్వులో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బీపీని నియంత్రిస్తాయి. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది.
అరటి పువ్వు గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కనుక దీన్ని తింటే షుగర్ లెవల్స్ అమాంతం పెరగవు. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. పైగా ఈ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వల్ల ఇన్సులిన్ను శరీరం మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గి డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అరటి పువ్వులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. దీని వల్ల రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. శరీరంలోని వాపులు తగ్గిపోతాయి. మహిళలు రుతు సమయంలో ఈ పువ్వులను తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఈ పువ్వులను తినడం వల్ల అతిగా రక్తస్రావం జరగకుండా అడ్డుకోవచ్చు. కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నెలసరి సక్రమంగా వస్తుంది. రుతు సమస్యలు తొలగిపోతాయి.
అరటి పువ్వును తింటే బాలింతల్లో పాలు బాగా పడతాయి. ఈ పువ్వుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. కనుక ఈ పువ్వులను తింటే హిమోగ్లోబిన్ ఉత్పత్తి అవుతుంది. ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి. దీంతో రక్తహీనత తగ్గుతుంది. నీరసం, అలసట నుంచి బయట పడవచ్చు. అరటి పువ్వును కూరగా లేదా పచ్చడి రూపంలో తయారు చేసి తినవచ్చు. దీన్ని సలాడ్స్లోనూ వేసుకోవచ్చు. దీంతో సూప్లను కూడా తయారు చేసి తింటారు. ఇలా అరటి పువ్వును తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.