హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల కోసం నిధులను విడుదల చేసింది. పంచాయతీ కార్యదర్శుల బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం రూ.104 కోట్లు విడుదల చేసింది. దీంతో పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ అయ్యాయి. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చొరవతో ఒకే విడతలో నిధులు విడుదల చేశారు. ఈ చర్యతో పంచాయతీ కార్యదర్శులపై ఉన్న ఒత్తిడి తగ్గి ఊరట లభించింది.
ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెంటనే స్పందించి రూ.104 కోట్లు విడుదల చేశారన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికల సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే నిధులు విడుదల చేయడం గమనార్హం.