భువనగిరి కలెక్టరేట్, మార్చి 19 : యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురువగా పలు మండలాల్లో రాళ్లవర్షం పడింది. వర్షం కారణంగా పలు గ్రామాల్లో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. జిల్లాలోని యాదగిరిగుట్టలో అత్యధికంగా 76.8 మి.మీల కురియగా జిల్లాలో 28.8 సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భువనగిరిలో 71.4మి.మీ, బొమ్మలరామారంలో 66.4, బీబీనగర్లో 45.6, గుండాలలో 38.8, ఆలేరులో 32.4, ఆత్మకూర్(ఎం)లో 24.6, మోత్కూరులో 23.8, తుర్కపల్లి(ఎం)లో 22.6, రాజాపేటలో 16.6, భూదాన్పోచంపల్లిలో 12.4మిల్లీ మీటర్ల చొప్పున కురిసింది.
ధోతిగూడెంలో రాళ్లవాన
భూదాన్ పోచంపల్లి : మండలంలోని ధోతిగూడెం, జిబ్లక్ పల్లి గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం వడగళ్ల వర్షం కురిసింది. సుమారు 15 నిమిషాల పాటు బీభత్సం సృష్టించింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొట్టకు దశకు వచ్చిన వరి పైరు దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు.
ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంతో పాటు కూరెళ్ల, తుక్కాపురం, రాఘవాపురం గ్రామాలలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. వరి చేలు దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు.
మోటకొండూర్ : మండలంలోని కదిరేణిగూడెంతో పాటు పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. వడగండ్లకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
రాలిన మామిడి కాయలు
చౌటుప్పల్ రూరల్ : మండలంలోని మందళ్లగూడెం, దండు మల్కాపురం, సింగరాయచెరువు గ్రామాల్లో కురిసిన వడగండ్ల వర్షానికి మామిడి తోటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు రాలిపోవడంతో నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోయారు.
మోత్కూరు : మండలంలోని పలు గ్రామాల్లో మామిడి తోటల్లో కాయలు రాలి నేలపాలయ్యాయి. ఏడీఏ వెంకటేశ్వర్రావు, మోత్కూరు వ్యవసాయాధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలించి, నష్టాన్ని అంచనా వేశారు. మండలంలో సుమారు 450 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. ఆయన వెంట ఏఓ స్వప్న, ఏఈఓ గోపినాథ్ ఉన్నారు.
సూర్యాపేట జిల్లాలో వర్షం
సూర్యాపేట జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు మోస్త్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా పాలకీడు మండలంలో 7.6 సెంటీమీటర్లు, తిరుమలగిరిలో 6 సెం.మీ, నూతనకల్లో 4, మద్దిరాలలో 3, హుజూర్నగర్లో 2, తుంగతుర్తి, ఆత్మకూర్(ఎస్), నాగారం మండలాల్లో 1.5 సెంటీమీటర్ల వర్షం పడింది. మఠంపల్లి, జాజిరెడ్డిగూడెం, మేళ్లచెర్వు మండలాల్లో సెంటీ మీటరు చొప్పున వర్షం కురవగా మిగతా ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. తుంగతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది.
దెబ్బతిన్న పంటలు
తిరుమలగిరి : మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యవసాయ అధికారి డి. రామారావు దెబ్బతిన్న పంటచేలను ఆదివారం పరిశీలించారు. తిరుమలగిరి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు వరి, మామిడి, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి . తిరుమలగిరి జనగాం జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన హోర్డింగ్తో పాటు చెట్లు కూలి పోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నెల్లిబండలో గోడకూలి 20 గొర్రెలు మృతి చెందాయి. కోక్యాతండాలో ఆరెకరాల మిర్చి తోట దెబ్బతింది . కరెంట్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
మఠంపల్లి : మండలంలో కురిసిన వర్షాలకు మిర్చి, వరి చేలు పూర్తిగా నీటమునిగాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కల్లాల్లో ఎండబోసిన మిర్చి పంట నీటిలో తడిసింది.
చిట్యాలలో రాళ్లవాన
చిట్యాల : మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. పెద్దకాపర్తి, సుంకెనపల్లి గ్రామాల్లో వడగండ్లు పడ్డాయి. దాంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాళ్లవానతో పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రామన్నపేట : మండలంలోని సిరిపురం, వెల్లంకి గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. దాంతో సుమారు ఐదువందల ఎకరాల్లో వరి, మామిడి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లినట్లు మండల వ్యవసాయ అధికారి యాదగిరిరావు తెలిపారు.