హైదరాబాద్: హైదరాబాద్లో (Hyderabad) ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. నగరంలోని అనేక ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆగకుండా వవాన పడుతున్నది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, అల్వాల్, తిరుమలగిరి, చిలుకలగూడ, మారేడుపల్లి, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట, బొల్లారం, జవహర్నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, కొండాపూర్, కొంపల్లి, హైదర్నగర్, ఆల్విన్కాలనీ, నిజాంపేట, హైదర్నగర్, ఆల్విన్కాలనీ, మెహిదీపట్నం, నాంపల్లి, మలక్పేట, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్, బీఎన్రెడ్డి, ఉప్పల్, ఈసీఎల్, సరూర్నగర్, సైదాబాద్, చంపాపేట్, మలక్పేట్, లో భారీగా వర్షం పడుతున్నది. ఇక రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీపట్నం, మంచాల, యాచారంలో వాన కురుస్తున్నది. భారీ వర్షాలకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. చంపాపేట, రెడ్డి కాలనీతోపాటు పలు కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. మూసీ నదికి వరద పోటెత్తింది. మూసారంబాగ్ బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవహిస్తున్నది. హుస్సేన్ సాగర్లోకి పెద్దఎత్తున వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
వరద పరిస్థితిపై జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖ తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. 040-2111 1111, డీఆర్ఎఫ్ నంబర్ 90001 13667 లో సంప్రదించాలని సూచించారు.
59 పునరావాస కేంద్రాలు
భారీ వర్ష సూచనతో హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధికారులను అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల వారి కోసం హైదరాబాద్లో 59 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లో సోమవారం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించామని కలెక్టర్ తెలిపారు. వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అధికారులను కోరారు.