నమస్తే తెలంగాణ నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రోజంతా వానలు పడ్డాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల కుంభవృష్టి కురిసింది. చేవెళ్ల మం డలం కందవాడలో అత్యధికంగా 13.5, షాబాద్ మం డల కేంద్రంలో 12.1 సెంటీమీటర్ల వర్షం పడింది. ఈసీ, మూసీ నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండటంతో జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్కు వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు వాటి గేట్లు ఎత్తారు. పలు వాగులు ఉప్పొం గి ప్రవహిస్తుండటంతో షాబాద్, మొయినాబాద్, ఫరూఖ్నగర్, నందిగామ మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లోని చెరువులు అలుగు పారుతున్నాయి.
వికారాబాద్ జిల్లాలో 12.9 సెం.మీ.
వికారాబాద్లో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా పరిధిలో కాగ్నా, ఈసీ నదులు ఉధృతంగా ప్రవహించాయి. 374 చెరువులు అలుగులు పారుతున్నాయి. లఖ్నాపూర్, కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టులు, నందివాగు అలుగులు పారాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల, కొరిటికల్, బోథ్ మండలం పొచ్చెర జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. సారంగాపూర్ మండలం స్వర్ణ, భైంసాలో గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మాక్లూర్ మండలం మానిక్బండార్ వద్ద 63వ జాతీయ రహదారిని వర్షం నీరు ముంచెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బోధన్ మండలం సాలూర వద్ద మంజీరలో వరద ఉధృతి కొనసాగుతూనే ఉన్నది.
సిద్దిపేట-హనుమకొండ మధ్య నిలిచిన రాకపోకలు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, చేర్యాల నియోజకవర్గాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. సిద్దిపేట-హనుమకొండ రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పోరెడ్డిపల్లి చెక్డ్యాం నిండి అలుగు పారుతున్నది. పోరెడ్డిపల్లి బ్రిడ్జి, బస్వాపూర్ బ్రిడ్జి పిల్లర్లపై నుంచి వరద ఉప్పొంగుతున్నది. సింగరాయ ప్రాజెక్ట్ నిండి అలుగు పోస్తున్నది. తంగళ్లపల్లి బ్రిడ్జి వద్ద మోయతుమ్మెద వాగు, కరీంనగర్ రహదారిలో ఇందుర్తి బ్రిడ్జి వద్ద ఎల్లమ్మవాగు ఉధృతంగా పారుతున్నాయి. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో వాన దంచికొట్టింది. నగరంలో నాలాలు పెద్ద ఎత్తున ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడా వాన పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఇల్లెందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలం కోయగూడెం వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. ఆళ్లపల్లి మండలంలో జల్లేరు వాగు పొంగి ప్రవహిస్తున్నది.
చురుకుగా నైరుతి
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చాలా చురుకుగా కదులుతున్నాయి. దీంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు హైదరాబాద్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అతిభారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్, నారాయణపేట, మహబూబ్నగర్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ తూర్పు ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్, ఏపీ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి వ్యాపిం చి ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. రాయలసీమ నుంచి తమిళనాడు మీదు గా మరో ద్రోణి వ్యాపించినట్టు తెలిపింది. వీటి ప్రభావంతో ఈ నెల 30 వరకు రాష్ట్రంలోని భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు బుధవారం ప్రాథమిక హెచ్చరికలు జారీ చేసింది.
పెండ్లి రోజున బీచ్కు వెళ్లి వివాహిత గల్లంతు
పెండ్లిరోజును సరదాగా గడపడానికి భర్తతో కలిసి బీచ్కు వెళ్లిన వివాహిత గల్లంతైంది. ఏపీలోని విశాఖ పట్నంకు చెందిన శ్రీనివాస్, సాయిపల్లవి దంపతులు తమ పెళ్లిరోజు కావడంతో సోమవారం సాయంత్రం ఆర్కే బీచ్కు వెళ్లారు. తీరంలో సెల్ఫీలు తీసుకుంటుండగా సాయిపల్లవి సముద్రంలో గల్లంతైంది. శ్రీనివాస్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు మొదలుపెట్టినా సాయిపల్లవి ఆచూకీ దొరకలేదు.