హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణా బేసిన్లోని జలాశయాలకు వరద వచ్చి చేరుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రియదర్శిని డ్యామ్కు 58,600 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు ఆరుగేట్లు ఎత్తివేసి 66,090 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 6.325 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 26,907 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు నుంచి 972 క్యూసెక్కులు అవుట్ఫ్లో ఉన్నది.
పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు ప్రస్తుతం 534.80 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 177.6686 టీఎంసీల నీరుంది. గోదావరి బేసిన్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సైతం భారీగా వరద వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం 71,202 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులకు గాను 1088.80 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 78.981 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు శ్రీరాంసాగర్కు 64 టీఎంసీల వరద వచ్చి చేరింది.