హైదరాబాద్ : కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు మళ్లీ వరద పోటెత్తుతున్నది. జూరాల నుంచి నాగార్జున సాగర్ వరకు భారీగా వరద వస్తుండడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రియదర్శిని జలాశయానికి 1.75లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. జలాశయం 36గేట్లు ఎత్తి 1.85లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.16 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 8.92 టీఎంసీలుగా ఉన్నది.
అలాగే శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద వస్తుండడంతో ప్రాజెక్టు తొమ్మిది గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా 2,51,847 క్యూసెక్కులు సాగర్ వైపు వెళ్తున్నది. జూరాలతో పాటు సుంకేశుల నుంచి 3,50,341 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతున్నది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.80 అడుగులు ఉన్నది. గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 214.84 టీఎంసీలు ఉన్నది. శ్రీశైలం కుడి, ఎడమ గట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.
విద్యుత్ ఉత్పత్తి ద్వారా 62,446 క్యూసెక్కుల ఇన్ఫ్లో సాగర్కు విడుదలవుతున్నది. అలాగే నాగార్జున సాగర్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. దీంతో 20 గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2.93 లక్షల క్యూసెక్కులు స్పిల్వే ద్వారా విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 309.93 టీఎంసీల మేర నీరుండగా.. గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు. ప్రస్తుతం జలాశయానికి 3.10లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. అదేస్థాయిలో దిగువకు నీటిని వదులుతున్నారు.