జైపూర్: రాజస్థాన్లోని టోంక్ సవాయి మాదోపూర్లో ఇవాళ ప్రధాని మోదీ(PM Modi) బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో.. ప్రత్యేక ఓటు బ్యాంకు కోసం ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలని ఆ పార్టీ ప్రయత్నించిందని, దళితులు.. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను ఆ పార్టీ బ్రేక్ చేసిందని ప్రధాని మోదీ విమర్శించారు. రాజ్యాంగం దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉందన్నారు. కేవలం మతం ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను ఇచ్చిందన్నారు. దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులకు దక్కాల్సిన హక్కులను ముస్లింలకు ఇచ్చినట్లు ఆయన ఆరోపించారు.
2004లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించాలని భావించిందన్నారు. ఆ రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలని ప్రయత్నించినట్లు చెప్పారు. ఏపీలో నాలుగు సార్లు ముస్లిం రిజర్వేషన్లను అమలు చేయాలని అప్పటి ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. కానీ చట్టపరమైన చిక్కుల వల్ల అది సాధ్యం కాలేదన్నారు.
మోదీ మీకో గ్యారెంటీ ఇస్తున్నారని, దళితులు.. వెనుకబడిన తరగతులు, గిరిజనులకు చెందిన రిజర్వేషన్లను తీసివేయమని, మతం ఆధారంగా ఆ రిజర్వేషన్లను విభజించబోము అని ప్రధాని మోదీ తెలిపారు. తనకు రాజ్యాంగం అర్థం అవుతుందని, రాజ్యాంగ రక్షణకు తాను కట్టుబడి ఉన్నానని, బాబా సాహెబ్ అంబేద్కర్ను తాను ఆరాధిస్తానని ప్రధాని తెలిపారు.