అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకుంటే, ఎదిగే దశలో జ్ఞాపకశక్తికి నష్టం జరుగుతుందని అమెరికాలోని ఓహియో స్టేట్ విశ్వ విద్యాలయ అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా, ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఆ ప్రభావంతో మెదడు పదును తగ్గుతుంది. అది జ్ఞాపకశక్తి తగ్గిపోవడానికీ దారితీస్తుంది. అంతేకాదు, ప్రిజర్వేటివ్స్ దెబ్బకు మెదడుకు అకాల వృద్ధాప్యం వస్తుంది. ఫలితంగా, వ్యక్తులనూ వస్తువులనూ గుర్తించే శక్తి సన్నగిల్లిపోతుంది. ఆలూ చిప్స్, పిజ్జా, పాస్తా, మాంసం, చికెన్, ఇతర ఆహార పదార్థాల్లో పెద్ద ఎత్తున ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవి మెదడుకు హానికరం. వరుసగా నాలుగు వారాలు ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నా కూడా.. మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం తప్పదు. కొన్ని నిల్వ పదార్థాల్లో నైట్రోసమైన్స్ ఉంటాయి. వీటివల్ల కాలేయం విడుదల చేసే కొవ్వులు మెదడుకు విషంగా పరిణమిస్తాయి. మరికొన్నిటిలో డయాసిటైల్ ఉంటుంది. దీనివల్ల అల్జీమర్స్ ప్రమాదం పొంచి ఉంటుంది. అపసవ్య జీవనశైలికి అలవాటుపడిన వారిపై ఈ ప్రభావం మరీ ఎక్కువ. ఆరోగ్య కరమైన అలవాట్లు ఉన్నవాళ్లు మితంగా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటే మాత్రం, కొంతమేర ఫర్వాలేదంటారు నిపుణులు.