వేములవాడ ఏరియా దవాఖానలో ఈ-హెల్త్ ప్రొఫైల్ను ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్, పక్కన రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ “ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే పైలట్ ప్రాజెక్టు కింద రాజన్న సిరిసిల్ల్ల, ములుగు జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ వివరాలు సేకరిస్తున్నాం. వేలిముద్ర, కనుపాపతో అన్ని రికార్డులు రూపొందిస్తాం. హెల్త్ రికార్డులు సక్రమంగా నిర్వహించడం వల్ల అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు సమయం వృథా కాకుండా రోగికి వెంటనే చికిత్స ప్రారంభించవచ్చు. ఫలితంగా ప్రాణం కాపాడే అవకాశం ఉంటుంది.” అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన ముందుగా, ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపేట, వెంకటాపూర్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 40 డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేసి, పట్టాలను అందజేశారు. అనంతరం వేములవాడ ఏరియా దవాఖానలో హెల్త్ ప్రొఫైల్ డాటా సేకరణ ప్రాజెక్టుతో పాటు పలు అభివృద్ధి పథకాలను ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు.
వేములవాడ/ సిరిసిల్ల/ ఎల్లారెడ్డిపేట, మార్చి 5: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా హెల్త్ ప్రొఫైల్ వివరాలు సేకరిస్తున్నామని, పైలట్ ప్రాజెక్టు కింద రాజన్న సిరిసిల్ల్ల, ములుగు జిల్లాల్లో ప్రయోగత్మాకంగా చేపడుతున్నామని, దీనిని విజయవంతంగా చేసి దేశానికే ఆదర్శంగా నిలుద్దామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సూచించారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన, ముందుగా 12:10 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లికి చేరుకుని రూ.27.50 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని, రూ.12 లక్షలతో నిర్మించిన పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించారు. మధ్యాహ్నం 1 గంటకు వెంకటాపూర్లో రూ.20లక్షలతో నిర్మించిన రైతు వేదికను, రూ.10లక్షల వ్యయంతో నిర్మించిన కేసీఆర్ రైతు ప్రాంగణాన్ని ప్రారంభించారు. తర్వాత కేసీఆర్నగర్లో రూ.2.01 కోట్లతో నిర్మించిన 40 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. అనంతరం వేములవాడకు చేరుకుని వంద పడకల దవాఖానలో హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణతో కలిసి ప్రారంభించారు. రూ.2 కోట్లతో సీటీ స్కాన్, రూ.కోటితో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్, రూ.70 లక్షలతో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్, రూ.15 లక్షలతో పిడియాట్రిక్ వార్డు, రూ.15 లక్షలతో పాలియేటివ్ కేర్ సెంటర్, రూ.15 లక్షలతో అతి సూక్ష్మంగా పరిశీలించే టీబీరోగ నిర్ధారణ పరీక్ష కేంద్రం ప్రారంభించారు. రూ.20 కోట్లతో పట్టణంలో ఏర్పాటు చేయనున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులకు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో రూ.4.50 కోట్లతో సమీకృత మార్కెట్ భవన నిర్మాణానికి శిలాఫలకాలు ఆవిష్కరించారు. మర్రిపల్లిలోని కస్తూర్బా పాఠశాలలో రూ.2.05 కోట్లతో నిర్మించిన నూతన కళాశాల భవనం, రైతు వేదికను ప్రారంభించారు.
రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలు సేకరించాలన్న లక్ష్యంతో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపట్టామని మంత్రి కేటీఆర్ చెప్పారు. జిల్లాలో 18 ఏండ్లు నిండిన వారు 4 లక్షలా 22 వేల మంది ఉన్నట్లు గుర్తించామని, వీరి ఆరోగ్య వివరాలను ఒక ఏఎన్ఎం, ఇద్దరు ఆశావర్కర్ల బృందం సేకరిస్తుందని చెప్పారు. 10 నుంచి 15 కుటుంబాలను కలిసి ఆరోగ్య సమస్యలను తెలుసుకొని వివరాలు ట్యాబ్లో రికార్డు చేస్తారని, అక్కడే కంటి పరీక్ష, ఓరల్ స్క్రీనింగ్ బీపీ పరీక్షించి, రక్త పరీక్షల కోసం నమునాలు తీసుకుంటారని, ఈ నమునాలను సిరిసిల్ల టీ డయాగ్నోస్టిక్లో పరీక్షలు చేస్తారని వివరించారు. హెల్త్ రికార్డులు సక్రమంగా నిర్వహించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, అపస్మారకస్థితిలో ఉన్నప్పుడు రోగి వేలిముద్ర, కనుపాపతో అన్ని రికార్డులు, వివరాలు తెలుసుకొని వెంటనే చికిత్స ప్రారంభించే అవకాశం ఉంటుందని, దీంతో అత్యవసర సమయంలో విలువైన అరగంట సమయం వృథా కాకుండా ప్రాణం కాపాడవచ్చని చెప్పారు. ప్రస్తుతం ములుగు, సిరిసిల్ల జిల్లాలో ప్రారంభిస్తున్నామని, 60 రోజుల తర్వాత మిగితా జిల్లాల్లో చేపడతామన్నారు. రాజన్న సిరిసిల్ల ప్రాంతంలో క్యాన్సర్ వ్యాధి ఎక్కువగా ఉన్నట్లు, మరికొన్ని చోట్ల హృద్రోగాలు ఎక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. హెల్త్ వివరాల సేకరణ ద్వారా ఆ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకోవడమే కాకుండా అక్కడ చేపట్టాల్సిన వైద్య సదుపాయాలపైనా అవగాహన వస్తుందని చెప్పారు. స్వరాష్ట్రంలో వైద్యసదుపాయాలు మరింత మెరుగు పడ్డాయని, ఇందుకు వేములవాడ వంటి దవాఖానలో చేపట్టిన అధునాతన వసతి సౌకర్యాలే నిదర్శనమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్య తరగతి ప్రజలకు విద్య, వైద్యం మరింత ఖరీదుగా మారిందని, స్వరాష్ట్రంలో ప్రజలందరికీ ఈ సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని చెప్పారు. వేములవాడ దవాఖానలో కరోనాతో బాధపడుతున్న గర్బిణికి వైద్య సేవలు అందించి ఆదర్శంగా నిలిచారని కొనియడారు.
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు ఏదో ఒక రూపంలో వర్తిస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. వెంకటాపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేసిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై ఆయన మాట్లాడారు. పైరవీలకు తావు లేకుండా డబుల్బెడ్రూం ఇండ్లను నిరుపేదలకు పారదర్శకంగా కేటాయించినట్లు తెలిపారు. ఇండ్ల సముదాయంలో విద్యుత్ సౌకర్యం, మురికి కాలువలు, తాగు నీటి వసతి కల్పించినట్లు వెల్లడించారు. వసతి సౌకర్యాలు కల్పించి, లబ్ధిదారులను ఎంపిక చేసిన అధికారుల కృషికి అభినందనలు తెలిపారు. అర్హత ఉండి డబుల్ బెడ్రూం ఇండ్లు రానివారికి భూమి పట్టాలు పంపిణీ చేశారు. వీరికి బడ్జెట్ సమావేశాల అనంతరం ప్రభుత్వం రూ.5 లక్షలు కేటాయిస్తుందని భరోసా కల్పించారు. ఉమ్మడి పాలనలో గ్రామానికి రూ.50 లక్షల నిధులు కేటాయించడం గగనంగా ఉండేదని కేవలం వెంకటాపూర్కే రూ.5 కోట్ల నిధులు కేటాయించిందని వివరించారు. రాష్ట్రంలో పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా డబుల్బెడ్రూం ఇండ్లను రాష్ట్రంలో అందిస్తున్నదని తెలిపారు. విమర్శలు చేసే వారు గ్రామాలకు ఏం చేశారో? చెప్పాలని మంత్రి సవాల్ విసిరారు. ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అనే నానుడిని రాష్ట్రంలోని అర్హులైన పేదలకు సీఎం కేసీఆర్ చేసి చూపెడుతున్నారని చెప్పారు. డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి, కల్యాణలక్ష్మిని అందిస్తున్నట్లు తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇంత కంటే మంచి పథకాలు ఉన్నట్లుగా నిరూపిస్తే తాము రాజీనామాకు సిద్ధమని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మర్రిపల్లి రైతు వేదిక ప్రారంభించిన అనంతరం బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. కులం, మతం పిచ్చి పేరుతో రెచ్చ గొడుతూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, వారి కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మబోరన్నారు. కాశీలో రూ.వెయ్యి కోట్లు పెట్టి ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లుగా చెబుతున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి కరీంనగర్ ఎంపీగా వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.వంద కోట్లు తెచ్చే తెలివి ఏమైందని విమర్శించారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రతి ఇంటి ముందు నల్ల, ప్రతి రైతుకు బీమా, ప్రతి గ్రామంలో నర్సరీ, సాగునీటి వనరులు పెరిగి పచ్చని పొలాలు చూస్తుంటే ప్రతి పక్షాలకు కళ్లు మండుతున్నాయని ఎద్దేవా చేశారు.
కార్యకర్త కుటుంబానికి మంత్రి కేటీఆర్ ధీమా
ఎల్లారెడ్డిపేట, మార్చి 5: ‘తమ్ముడిని తేకున్నా.. అన్నగా నేనున్నా’ అంటూ కార్యకర్త కుటుంబానికి మంత్రి కేటీఆర్ భరోసా నిచ్చారు. గతేడాది ఆగస్టు 27న వెంకటాపూర్కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మేడిశెట్టి రాజు పొలం వద్ద స్టాటర్ ఆన్ చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. వారం రోజుల్లో రైతు బీమా రూ.5లక్షలు జమకాగా బాధిత కుటుంబ సభ్యులకు కొంత ఊరట దొరికింది. టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం ఉన్నందున ప్రమాద బీమా సొమ్ము రూ.2లక్షలు మంజూరైంది. ఎల్లారెడ్డిపేట మండలంలో శనివారం పర్యటించిన మంత్రి కేటీఆర్ స్వయంగా ఆ కార్యకర్త ఇంటికి వెళ్లి రాజు సతీమణి లత, కుమారులను పరామర్శించారు. స్వయంగా ప్రమాద బీమా చెక్కు రూ. 2లక్షలను వారికి అందించారు. కుటుంబ బాగోగులను తెలుసుకుని ‘తమ్ముడిని(రాజును) నేను తేకున్నా.. అన్నగా, భరోసాగా నేనున్నా’ అంటూ ఆ కుటుంబానికి ధీమానిచ్చారు. రాజు పెద్ద కుమారుడు నందువర్ధన్ ఇంటర్ చదువుతుండగా అతడిని ఇంజినీరింగ్, చిన్న కుమారుడు విష్ణువర్ధన్ను పై చదువులు చదివించే బాధ్యత పార్టీదేనని మంత్రి కేటీఆర్ అక్కడే ఉన్న టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో పేర్కొన్నారు.
– ఎమ్మెల్యే రమేశ్బాబు
వేములవాడ ఏరియా దవాఖానలో అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్ల రానున్న రోజుల్లో కార్పొరేట్ దవాఖానలకు చెల్లుచీటి పడనుందని ఎమ్మెల్యే రమేశ్బాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి తగిన ప్రాధాన్యత ఇస్తుందని, వేములవాడ వంటి దవాఖానలో అధునాతన వైద్యసదుపాయాలే ఇందుకు నిదర్శనమన్నారు. వైద్య ఆరోగ్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బంది రెండేళ్లుగా అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, నాఫ్స్కాబ్ చైర్మన్ రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, వేములవాడ, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్లు రామతీర్థపు మాధవి, జిందం కళ, జాతీయ ఆరోగ్య మిషన్ ఎండీ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ ఖిమ్యానాయక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వీటీడీఏ వైస్ చైర్మన్ ముద్దసాని పురుషోత్తంరెడ్డి, వీటీడీఏ కార్యదర్శి భుజంగరావు, ఆర్డీవోలు లీల, శ్రీనివాసరావు, జిల్లా వైద్యాధికారి సుమన్మోహన్రావు, జిల్లా విద్యాధికారి రాధాకిషన్, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ రేగులపాటి మహేశ్రావు, తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ బద్దిపోచమ్మ ఆలయ విస్తరణలో భాగంగా భాగస్వామ్యం అవుతున్న నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజన్న ఆలయానికి పర్యాటకులుగా వస్తున్న కొందరు రాజకీయ పార్టీల నాయకులు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ ప్రాముఖ్యతతో కూడుకొని ఉన్నందున అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా 9 మంది నిర్వాసితులకు రూ.3.50 కోట్ల చెక్కులను అందజేశారు.
పాఠశాలల్లో మౌలిక వసతులను పెంపొందించి మెరుగైన విద్యా విధానాలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని గొప్పగా ప్రారంభించబోతున్నామని మంత్రి చెప్పారు. అందులో భాగంగానే రూ.7,300 కోట్లతో ఈ నెల 8న వనపర్తి జిల్లా నుంచి ప్రారంభిస్తారని తెలిపారు.
కాశీలో రూ.వెయ్యికోట్లు పెట్టి ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ చెబుతున్నడు. కానీ, వేములవాడ ఆలయ అభివృద్ధికి కనీసం రూ.వంద కోట్లు తెచ్చే తెలివేమైంది? రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల కళ్ల ముందున్నయ్. పూటకో మాట మాట్లాడే నాయకులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూపాలె. తెలంగాణ బిడ్డలుగా వారు చేసిన పనేంటో చెప్పాలని ఎక్కడికక్కడ నిలదీయాలె.