మన పెద్దలు సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లోనే వరి పండించేవారు. రసాయనాల జాడలేని పప్పు, ఉప్పు కొనేవారు. నాణ్యమైన దినుసులతో పచ్చళ్లు పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు.. వంటిల్లు రసాయనాల చిరునామాగా మారింది. ప్రతి పదార్థంలో ఎన్నోకొన్ని కెమికల్స్! ఆ తిండి దాదాపుగా విషం లాంటిదే. ఇదే పరిస్థితి కొనసాగితే.. భవిష్యత్తులో ఆరోగ్య సంక్షోభం ఖాయం. ఈ సమస్యకు పరిష్కారంగా దేశవాళి వరి వినియోగాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన గుంటక సత్యవతి.
చేసే వంట, పండించే పంట, తినే ఆహారం.. ఏ విషయంలోనూ రాజీపడదు నేటితరం. గుంటక సత్యవతి ఆలోచనా విధానం కూడా ఇలానే ఉంటుంది. నీళ్లతోపాటు రసాయనాలనూ పారించి పండించిన బియ్యం వల్ల ఆరోగ్యానికి ఎంత నష్టమో, భవిష్యత్తు తరాలకు ఎంత కష్టమో ఆమెకు తెలుసు. ఆ ఉత్పాతాన్ని తలుచుకుని మనసులోనే మథనపడిపోయేవారు. ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో లోతైన అధ్యయనం జరిపారు. చివరికి, దేశవాళి వరి సాగే సరైందని గ్రహించారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు ఆ నిర్ణయంతో ఏకీ భవించారు. దీంతో తన ఐడియాను వ్యాపారంగా మార్చే ప్రయత్నం ప్రారంభించారు.
సత్యవతిది మొదటి నుంచీ వ్యవసాయ కుటుంబం. భర్త చిక్కారెడ్డి కూడా రైతే. పెనిమిటితో కలిసి వ్యవసాయం చేసేవారు సత్యవతి. దీంతో రకరకాల పంటలపై అవగాహన వచ్చేసింది. కొవిడ్ నేపథ్యంలో దేశవాళి వరి సాగుకు ఉపక్రమించారు. జీఎస్ఆర్ ఫుడ్స్ పేరుతో ఓ స్టార్టప్ ప్రారంభించారు. విజయవాడలోని ఓ కంపెనీలో సివిల్ ఇంజినీర్గా పనిచేస్తున్న వాళ్లబ్బాయి గణేశ్ రెడ్డి ఉద్యోగాన్ని వదిలి వచ్చేశాడు. వరికి సంబంధించిన కొత్త ఉత్పత్తుల అధ్యయనం, వ్యాపార విస్తరణలో తల్లికి సాయం చేస్తున్నాడు. తను ఎంటెక్ చదివాడు. మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ అయిన కోడలు మంజీర సైతం తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు.
పోషకాల సమ్మేళనం
బ్లాక్, రెడ్ రైస్.. పక్కా దేశవాళి రకాలు. బ్లాక్ రైస్ రకాల్లో ఒకటైన ‘బర్మా’ను అస్సాం, మణిపూర్, మేఘాలయ రాష్ర్టాల్లో ఎక్కువగా పండిస్తారు. రెడ్ రైస్లో ‘నవారా’ రకం కేరళలో పుష్కలంగా లభిస్తాయి. ఈ రెండు రకాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులు కూడా ప్రయోగాలు చేస్తున్నారు. పోషకాలు మిళితమైన బ్లాక్, రెడ్ రైస్ క్యాన్సర్ నివారణకు సహకరిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆర్థరైటిస్, మధుమేహం రోగులకు ఊరటనిస్తాయని ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇవి మేలు చేస్తాయి. డాక్టర్లు సైతం సిఫారసు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సత్యవతి కుటుంబం ఆరంభంలో 11 రకాల దేశవాళి వరి రకాలు సాగు చేసింది. ప్రస్తుతం మాత్రం.. బ్లాక్, రెడ్ రైస్కే మార్కెట్లో డిమాండ్ ఉండటంతో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేశ్పాడులోని తమ సొంత పొలంలో.. ఈ రెండు రకాలను వేదకాలం నాటి పద్ధతుల్లో పండిస్తున్నారు. ఇంట్లోనే చిన్నమిల్లు ఏర్పాటు చేసుకుని ప్రాసెసింగ్ చేస్తున్నారు. బియ్యం విక్రయానికి ప్రత్యేకంగా ఒక పోర్టల్ ఉంది. దీంతోపాటు సామాజిక మాధ్యమాల్లో తరచూ పోస్టులు పెడుతున్నారు. తెలిసినవారి ద్వారా ఆఫ్లైన్లోనూ ఆర్డర్లు వస్తున్నాయి.
విదేశాలకు ఎగుమతి
సత్యవతి దేశవాళి పంటలకే పరిమితం కాకుండా.. ఆర్గానిక్ ఉత్పత్తులకూ శ్రీకారం చుట్టారు. యాభై రకాల వెజ్, నాన్వెజ్ పచ్చళ్లను జీఎస్ఆర్ ఫుడ్స్ పేరుతో తయారు చేస్తున్నారు. పలురకాల కారం పొడులతోపాటు స్వీట్లు, చిప్స్ విక్రయిస్తున్నారు. ఆమె పచ్చళ్లు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆర్గానిక్ ఉత్పత్తుల విక్రయాలతో.. ఖర్చులుపోనూ నెలకు రూ.1.50 లక్షల వరకు సంపాదిస్తున్నట్టు సత్యవతి చెబుతున్నారు. ‘ప్రతి ఒక్కరూ నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంపై దృష్టిపెట్టాలి. ఆ ఉద్దేశంతోనే రంగుల బియ్యాన్ని పండిస్తున్నాం. వ్యాపార దృక్పథానికి అతీతంగా.. భావితరాలకు అలనాటి రుచులను అందించాలన్నదే మా లక్ష్యం. గత రెండేండ్లుగా ఆర్గానిక్ పద్ధతిలో మామిడి కూడా పండిస్తున్నాం. వీహబ్లో తీసుకున్న శిక్షణ మా వ్యాపార విస్తరణకు ఎంతో ఉపయోగపడింది’ అంటారామె.
– గంజి ప్రదీప్కుమార్