కోరుట్ల, మార్చి 25: బతుకు దెరువు కోసం మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లిన కొడుకు ఇంటికి తిరిగి వస్తున్నాడని తెలిసి కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులకు నిరాశే మిగిలింది. హైదరాబాద్లోని ఎయిర్పోర్టులో దిగిన సదరు యువకుడు మరి కొద్ది గంటల్లో ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి రెండు రోజులైనా చేరుకోకపోవడంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. బాధిత కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని హజీపురా కాలనీకి చెందిన మహ్మద్ తహేరా భేగం, ఫక్రుద్దీన్ దంపతులకు నలుగురు కుమారులు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ కు టుంబంలో ఇంటికి పెద్దవాడైన సమీర్ బతుకు దెరువు కోసం నాలుగేళ్ల క్రితం సౌదీ ఆరేబియా వెళ్లి సంవత్సరం తర్వాత ఇండియాకు తిరిగివచ్చాడు. మళ్లీ మూడేళ్ల క్రితం కువైట్ దేశం వెళ్లాడు. అక్కడ ఓ షేక్ వద్ద హౌస్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ నెల 23న ఇండియాకు వస్తున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అం దించాడు. ఉదయం 6.50 గంటలకు కువైట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న సమీర్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు ట్రైన్లో వస్తున్నట్లు తెలిపాడు. మధ్యాహ్నం సమీర్కు కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన చెందారు. రెండు రోజులుగా ఫోన్ చేస్తున్నా ఫలితం లేదు. చివరకు శుక్రవారం ఓ అపరిచిత వ్యక్తి సమీర్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. సదరు వ్యక్తి సమీర్ తన వద్దే ఉన్నాడని ఒకసారి.. సమీర్ చని పోయాడని మరోసారి.. తనకు డబ్బులు బాకీ ఉన్నాడని.. ఇలా పొంతన లేని సమాధానం చెప్పాడు. అతడిని మాటల్లోకి దించిన కుటుంబసభ్యులు చిరునామా తెలుపాలని కోరగా సికింద్రాబాద్లోని రైల్వేస్టేషన్ పక్కన ఓ ఇంట్లో ఉన్నట్లు చెప్పాడు. దీంతో భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు సమీర్కు ఏ హాని తలపెట్టవద్దని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రాధేయపడ్డారు. మళ్లీ కొన్ని గంటలకే ఫోన్ స్విఛాప్ రావడంతో కంగారుపడి కోరుట్ల పోలీసులను ఆశ్రయించారు. జీరో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.