Credit Cards | న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: క్రెడిట్ కార్డు ఆధారిత లావాదేవీలు రికార్డు స్థాయికి చేరాయి. గత నెలలో నిరుడుతో పోల్చితే 20 శాతం పుంజుకున్నాయి. అంతకుముందు నెల ఫిబ్రవరితో చూస్తే 10 శాతం పెరిగాయి. ఈ క్రమంలోనే ఆన్లైన్లో నెలవారీ క్రెడిట్ కార్డుల వినియోగం తొలిసారి లక్ష కోట్ల రూపాయల మార్కును దాటింది. ఈ ఏడాది మార్చిలో రూ.1,04,081 కోట్లుగా ఉన్నది మరి. ఫిబ్రవరిలో ఇది రూ.94,774 కోట్లుగా ఉంటే, గత ఏడాది మార్చిలో రూ.86,390 కోట్లుగానే ఉన్నది. ఇక ఆఫ్లైన్లోనూ క్రెడిట్ కార్డు లావాదేవీలు (పాయింట్ ఆఫ్ సేల్-పీవోఎస్) 20 శాతం ఎగిశాయి. గత నెల రూ.60,505 కోట్లుగా ఉన్నాయి. క్రిందటి ఏడాది మార్చిలో ఇవి రూ.50,920 కోట్లు. ఈ ఫిబ్రవరిలో రూ.54,431.48 కోట్లుగా ఉన్నాయి. దీంతో అటు ఆన్లైన్, ఇటు ఆఫ్లైన్లలో క్రెడిట్ కార్డు ద్వారా జరిగిన లావాదేవీల విలువ ఈ మార్చిలో ఏకంగా రూ.1,64,586 కోట్లుగా నమోదైంది. ఏడాది క్రిందట ఇదే నెలలో రూ.1,37,310 కోట్లే. ఈ ఫిబ్రవరిలో మాత్రం రూ.1,49,205 కోట్లుగా ఉన్నది.
క్రెడిట్ కార్డ్ మార్కెట్లో దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టాప్లో ఉన్నది. ఈ మార్చి ఆఖరు నాటికి 20.2 శాతం వాటా దీనిదే. ఆ తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 18.6 శాతంతో రెండో స్థానంలో ఉన్నది. మూడో స్థానంలో ఐసీఐసీఐ బ్యాంక్ కొనసాగుతున్నది. ఇక నిరుడు మార్చితో పోల్చితే ఈ ఏడాది మార్చిలో క్రెడిట్ కార్డు వినియోగదారులూ పెరిగారు. దేశంలో క్రెడిట్ కార్డుల సంఖ్య 20 శాతం ఎగబాకి 10.1 కోట్లకు చేరింది. ఫిబ్రవరిలో మొదటిసారి 10 కోట్ల మార్కును దాటింది. నిరుడు మార్చిలో 8.5 కోట్ల క్రెడిట్ కార్డులే ఉండగా, ఏడాది కాలంలో దాదాపు 1.5 కోట్లకుపైగా పెరుగడం గమనార్హం. ఇక క్రెడిట్ కార్డ్ మార్కెట్లో 90 శాతం వాటా.. వాటిని పెద్ద ఎత్తున జారీ చేస్తున్న టాప్-10 బ్యాంకులదే.