హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని హాస్టళ్లలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై జూన్ 10లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్రంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు సరిగా లేవంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్ ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని 60 రోజుల్లో ముగ్గురు విద్యార్థులు మరణించడంతోపాటు 100 మంది అనార్యోగానికి గురయ్యారని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని 2,800 హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో 7.58 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఉన్నారని, ఆయా హాస్టళ్లు, పాఠశాలల్లో 52 వేల మరుగుదొడ్లు, 30 వేలకుపైగా బాత్రూములు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. హాస్టళ్లలో వసతుల కొరత ఉన్నమాట వాస్తవమేనని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు. వేసవి సెలవులు ముగిసేలోగా ఈ సమస్యలను పరిషరించేందుకు చర్యలు తీసుకుంటారని హామీ ఇవ్వడంతో విచారణ జూన్ 10కి వాయిదా పడింది.