న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై దాడి కేసులో (Swati Maliwal Assault Case) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్కు ఊరట లభించలేదు. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో బిభవ్ కుమార్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనికి ముందుగానే ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ కోర్టును ఆయన ఆశ్రయించారు. మే 13న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కలిసేందుకు స్వాతి మలివాల్కు ఎలాంటి అపాయింట్మెంట్ లేదని బిభవ్ కుమార్ తరపు సీనియర్ న్యాయవాది ఎన్ హరిహరన్ కోర్టుకు తెలిపారు. సీఎం కేజ్రీవాల్ భద్రతా ఉల్లంఘనకు ఆమె ప్రయత్నించారని ఆరోపించారు.
కాగా, స్వాతి మలివాల్పై దాడి ఆరోపణలు కల్పితమని బిభవ్ కుమార్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను ఆయన సమర్పించారు. ఎవరి ఒత్తిడి వల్లనో ఈ నెల 16న పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసిందని ఆరోపించారు. బిభవ్ కుమార్కు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు కోర్టులో వాదించారు.
మరోవైపు బిభవ్ కుమార్ ముందస్తు బెయిల్పై విచారణ జరుగుతుండగా శనివారం సాయంత్రం 4.15 గంటలకు ఆయనను పోలీసులు అరెస్టు చేసినట్లు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ కుమార్ శ్రీవాస్తవ కోర్టుకు తెలిపారు. దీంతో ముందస్తు బెయిల్ పిటిషన్ను నిరుపయోగంగా పరిగణించాలని కోరారు. ఈ నేపథ్యంలో బిభవ్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది.