Harsha Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుమారుడు హర్షారెడ్డి విదేశాల నుంచి కోట్లాది రూపాయల విలువైన చేతిగడియారాలను అక్రమంగా తెప్పించడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల సింగపూర్ నుంచి చెన్నై వచ్చిన స్మగ్లర్ ముబీన్ ఖరీదైన 9 పటేక్ ఫిలిప్, బ్రిడ్యూట్ వాచీలను హర్షారెడ్డికి సైప్లె చేసినట్టు కస్టమ్స్ అధికారులు తేల్చినట్టు తెలుస్తున్నది. ఈ వాచీల కోసం హర్షారెడ్డి క్రిప్టో కరెన్సీతోపాటు హవాలా మార్గం ద్వారా డబ్బులు చెల్లించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ వాచీల కోసం హర్షారెడ్డి ఇప్పటికే 2సార్లు హాంకాంగ్కు వెళ్లినట్టుగా అధికారులు గుర్తించడంతో ఆయనకు, స్మగ్లర్లకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. పటేక్ ఫిలిప్ వాచీలను అమ్మేందుకు మన దేశంలో డీలర్లు లేరు. ప్రస్తుతం మన దేశంలో బ్రిడ్యూట్ వాచీలు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో ఆ వాచీలనే హర్షారెడ్డి ఎందుకు తెప్పించాడన్న దానిపై కస్టమ్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. దీంతో హర్షారెడ్డి ఈ నెల 27న చెన్నై కస్టమ్స్ అధికారుల ఎదుట తన వాదన వినిపించనున్నారు. కాగా, ఈ వాచీల స్మగ్లింగ్లో మధ్యవర్తిగా వ్యవహరించిన నవీన్ కుమార్కు మద్రాస్ హైకోర్టు బెయిల్ తిరస్కరించింది.