ఖమ్మం, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఊరూరా జనప్రభంజనం.. ఎటుచూసినా గులాబీ వనం.. కేరింతలు కొట్టిన అభిమానం.. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ జనహోరు పోటెత్తింది. సోమ, మంగళవారాల్లో చేపట్టిన బస్సుయాత్ర, రోడ్షో కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. సోమవారం సాయంత్రం ఖమ్మం జిల్లా సరిహద్దు తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో అడుగుపెట్టింది మొదలు మంగళవారం రాత్రి కొత్తగూడెంలో రోడ్షో ముగిసే వరకూ ప్రజలు ఉద్యమ నేతకు నీరాజనం పలికారు. సోమవారం నాటి ఖమ్మం రోడ్షోకు కూడా అశేష జనవాహిని తరలిరాగా, మంగళవారం కొత్తగూడెం రోడ్షో కూడా అదే రీతిని తలపించింది. అభిమాన నేతను చూసేందుకు వేలాదిగా జనం రోడ్లపైకి చేరారు.
బస్సులోంచే కేసీఆర్ అభివాదం చేయగా ప్రతిస్పందనగా ఆయనకు అభివాదం చేస్తూ నినదిస్తూ, జేజేలు పలుకుతూ అభిమానం చాటుకున్నారు. సోమవారం రాత్రి ఖమ్మంలో మాజీ మంత్రి అజయ్కుమార్ నివాసంలో బసచేసిన కేసీఆర్.. మంగళవారం పార్టీ నేతలు, కార్యకర్తలతో ఉత్సాహంగా గడిపారు. సెల్ఫీలు దిగి జోష్ నింపారు. ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా మాట్లా డారు. రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కేసీఆర్తో భేటీ అయ్యారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు సానుకూల పరిస్థితి ఉన్నదని, పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం సాయంత్రం అజయ్కుమార్ ఇంటి నుంచి బయలుదేరి సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు ఇంటికి చేరుకుని ఆయనను పరామర్శించారు.
భద్రాద్రి రోడ్షోకు బస్సుయాత్ర ద్వారా బయలుదేరిన కేసీఆర్కు ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్ నుంచి కొత్తగూడెం వరకు అపూర్వ స్వాగతం లభించింది. కేసీఆర్ బస్సుపై శ్రేణులు దారి పొడవునా పూలవర్షం కురిపించారు. కొత్తగూడెంలో రోడ్షో ముగిసిన అనంతరం అక్కడి సింగరేణి గెస్ట్హౌస్లో కేసీఆర్ బసచేశారు.
కొత్తగూడెం చేరుకున్న ఉద్యమనేత కేసీఆర్ను మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నేతృత్వంలో భారీ ర్యాలీతో తోడ్కొని వెళ్లారు. కొత్తగూడెంలో కేసీఆర్ ప్రసంగాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో విజయం సాధించడంపై కర్తవ్యబోధ చేశారు.
కొత్తగూడెం రోడ్ షోలో కేసీఆర్ ఉర్దూలో అనర్గళంగా ప్రసంగించి ముస్లిం మైనార్టీలను ఆకట్టుకున్నారు. ‘బాయియోం.. ఔర్ బెహనోం..’ అంటూ సంబోధించారు. లౌకికవాదాన్ని కాపాడేది, ముస్లిం మైనార్టీలకు అండగా ఉండేది బీఆర్ఎస్ పార్టీయేనని భరోసా ఇచ్చారు. తన కంఠంలో ప్రాణమండగా ముస్లిం మైనార్టీల హక్కులకు భంగం కలగనివ్వబోమని స్పష్టం చేశారు.