హుజూరాబాద్ : వార్డుమెంబర్గా కూడా లేని ఈటల రాజేందర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే, మంత్రిని చేస్తే ఈ రోజు కేసీఆర్ నే నీతి, జాతి లేదని అంటున్నావని, వామపక్ష వాదినని చెప్పుకునే నీకు, నీవు చేరిన బీజేపీకి ఏ నీతి, జాతి ఉందని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు రాజేందర్పై నిప్పులు చెరిగారు.
శుక్రవారం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని భీం పల్లి గ్రామంలో నిర్వహించిన ధూంధాం కార్యక్రమంలో ఆయన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ లతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు రైతులకు నల్లచట్టాలు తెచ్చింది, రైతులకు అన్యాయం చేస్తుందని బీజేపీని తిట్టిన ఈటల మోడీతో ఏ ఒప్పందం కుదుర్చుకుని బీజేపీలో చేరాడని హరీశ్రావు ప్రశ్నించారు.
పుట్టుకతోనే వామపక్షవాదినని చెప్పుకున్న నీవు మతతత్వ బీజేపీలో చేరావంటే నీతి ఎవరికీ లేదో ప్రజలే చెప్తారని మంత్రి ఎద్దెవా చేశారు. కేవలం నీ ఆస్తులు , పదవులు కాపాడుకోవడానికే బీజేపీలో చేరావని ఆరోపించారు. నీవు ఓట్లు అడిగే ముందు మీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు నల్లచట్టాలు, గ్యాస్ ధరలు, డీజిల్, పెట్రోల్ ధరల పెంపుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తను చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగించి కొట్లాడి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్కు గోరి కడతాననడాన్ని మంత్రి తీవ్రంగా ఆక్షేపించారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలతో ప్రజలంతా లబ్ధి పొందుతున్నారని, రైతులు సంతోషంగా ఉన్నారని హరీశ్రావు తెలిపారు. ఎంతసేపు ఆత్మగౌరవం అంటూ తన బాధనంత మందిమీద రుద్దుడు తప్ప రాజేందర్ చేసేదేమీ లేదని హరీశ్రావు స్పష్టం చేశారు. నియోజకవర్గానికి 5వేల ఇండ్లు ఇస్తే ఒకటి కూడా పూర్తి చేయలేదని మంత్రి అన్నారు. గెల్లు శ్రీనివాస్ను గెలిపిస్తే ఐదు వేల ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత నాది అని హరీశ్రావు హామీ ఇచ్చారు. గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమని, భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు.