Harish Rao | గోదావరి బోర్డు రూపొందించిన ఎజెండాను సవరించాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పందించారు. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం GRMB ఎజెండాలో పెడితే.. ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు.
తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని ఏపీ ప్రతిపాదిస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెంటనే అభ్యంతరం చెప్పలేదు? ఎందుకు GRMBని నిలదీయలేదు? ఎందుకు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నిలదీశారు. బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాత హడావుడిగా లేఖలు రాయడం తప్ప.. తెలంగాణ ప్రయోజనాల పట్ల మీకు అసలు చిత్తశుద్ధి లేదా అని అడిగారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు.. మీ నామమాత్రపు లేఖలు తెలంగాణ ప్రాజెక్టులను కాపాడుతాయా? అని అడిగారు. లేఖలతో పనులు కావు. తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేయాలని సూచించారు.
ఏపీ ప్రభుత్వం GRMB ఎజెండాలో పెట్టిన అంశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. అవి ఎజెండా నుంచి తొలగించే వరకు తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టాలని.. అవసరమైతే.. ఆ అంశాలు వెనక్కి తీసుకోకపోతే GRMB సమావేశానికి హాజరు కాబోమని కరాఖండిగా తేల్చి చెప్పాలన్నారు. అలా కాకుండా మీ రాజకీయ అవసరాల కోసం మీటింగ్కు వెళ్లి.. అక్కడ తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ పెట్టిన అభ్యంతరాలకు బలం చేకూర్చేలా వ్యవహరిస్తే మాత్రం బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి.. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు.. తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. తెలంగాణ నీటి హక్కులకు సంబంధించిన విషయం అని హరీశ్రావు చెప్పారు. ప్రతిపక్షాలపై పిచ్చి ప్రేలాపనలు చేసే రేవంత్ రెడ్డి.. రాష్ట్ర ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు చెబితే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈ నెల 18న హైదరాబాద్లో జరిగే GRMB సమావేశం ఎజెండాను ఉపసంహరించుకోకుండా నిర్వహిస్తే.. తెలంగాణ ప్రాజెక్టులను కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ వేలాది మందితో GRMB కార్యాలయాన్ని ముట్టడిస్తుందని హెచ్చరించారు. కేంద్రం చేతిలో ఉన్న GRMB, చంద్రబాబు, రేవంత్ కలిసి తెలంగాణకు చేస్తున్న జల ద్రోహాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు.