Harish Rao | నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములను కబ్జా చేసే హక్కు ఎవరు ఇచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రశ్నించారు. ఇది 30% కమిషన్ సర్కార్ అని ప్రజలే అంటున్నారని తెలిపారు. హైదరాబాద్ బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి కాలనీ, హేమానగర్ కాలనీలకు చెందిన వందలాది మంది 22A బాధితులు వచ్చి తమ ఆవేదన చెబుతుంటే గుండె కలిచివేసిందని అన్నారు.
సర్వే నంబర్ 215, 215 పార్ట్లలో 30 ఏళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా సుమారు 1,500 కుటుంబాలు నివసిస్తున్న ఇళ్లను రాత్రికి రాత్రే కాంగ్రెస్ ప్రభుత్వం అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద 22A నిషేధిత జాబితాలో చేర్చడం అత్యంత దుర్మార్గమని హరీశ్రావు మండిపడ్డారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఇల్లు అమ్ముకుందామని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే.. ఆస్తి ప్రొహిబిషన్లో ఉందన్న విషయం తెలియడంతో కాలనీ వాసులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని అన్నారు. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన ఇళ్లను అడ్డుపెట్టుకుని ప్రజలపై ఒత్తిడి తెచ్చి 30 శాతం కమీషన్లు దండుకునేందుకే ఇలాంటి కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా కోడై కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దశాబ్దాలుగా ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలకు ఇప్పుడు 22A భయం చూపిస్తూ, బినామీలతో సెటిల్మెంట్లు చేసుకునే దందాకు తెరలేపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హరీశ్రావు తెలిపారు. దీనికి మీ సమాధానం ఏంటని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. బోడుప్పల్ కాలనీ వాసులు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాధితులందరూ అధైర్యపడవద్దు. ఈ వసూళ్ల సర్కార్ మెడలు వంచైనా సరే మీ ఆస్తులను కాపాడే బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని స్పష్టం చేశారు.
మాటలు పక్కనబెట్టి, తక్షణమే ఆయా కాలనీలను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి, బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే బాధితుల పక్షాన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరించారు.