న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే దానికి సమగ్ర కారణాలను కేంద్ర విదేశాంగ శాఖ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మామ్దానీతో భేటీ అయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించినట్లు తెలిసింది. అమెరికా పర్యటనలో న్యూయార్క్ మేయర్తో భేటీ జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆయన పర్యటనను అడ్డుకున్నట్లు డిప్లమాటిక్ వర్గాలు ద్వారా తెలుస్తోంది. అమెరికాలో సీఎం రేవంత్ పర్యటన సహేతుకం కాదు అని మాత్రమే విదేశాంగ శాఖ తన కారణాల్లో అభిప్రాయపడింది.
పొలిటికల్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల రేవంత్ అమెరికా ట్రిప్ రద్దు అయినట్లు తెలుస్తోంది. సీఎంలు కానీ, ఇతర ప్రతినిధిలు ఎవరు వెళ్లినా, ఈ అంశాన్ని కేంద్ర విదేశాంగ శాఖ పరిశీలిస్తుందని, రాజకీయ క్లియరెన్స్ ఉంటేనే ఆ ప్రతిపాదత సమావేశాలకు అనుమతి దక్కుతుందని, ఆయన వెళ్తున్న ఉద్దేశం, ఆయన హోదా .. రెండూ సమగ్రంగా ఉండాలని, కానీ ఈ కేసులో రేవంత్ అమెరికా పర్యటన ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడంలేదని, అందుకే ఆయన పర్యటనకు క్లియరెన్స్ దక్కలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్దీర్ జైస్వాల్ తెలిపారు.
అమెరికా పర్యటనలో మామ్దానీతో జరగబోయే భేటీ పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే రేవంత్ పర్యటన రద్దుకు ఇదే అసలు కారణమని కేంద్రం స్పష్టం చేయలేదు. కానీ ఇటీవల మామ్దానీ .. భారత ప్రధాని మోదీ పట్ల విమర్శలు చేశారు. భారత రాజకీయ, న్యాయ ప్రక్రియపై మామ్దానీ వ్యక్తం చేసిన అభిప్రాయాలు పట్ల కేంద్రం తీవ్రంగా ఖండించింది. జైలులో ఉన్న సామాజిక కార్యకర్త ఉమర్ ఖలీద్కు జనవరిలో మామ్దానీ ఓ వ్యక్తిగత లేఖ రాశారు. దాన్ని ఇండియా తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ స్వతంత్ర వైఖరిని ప్రజాప్రతినిధులు గౌరవించాలన్న విషయాన్ని భారత్ ఆ సందర్భంలో పేర్కొన్నది. విదేశీ న్యాయపరమైన అంశాల్లో వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడం సరైంది కాదు అని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది.
లండన్ పర్యటన ముగిసిన తర్వాత అక్కడ నుంచి నేరుగా అమెరికా వెళ్లాలనుకున్న రేవంత్ ప్లాన్కు కేంద్రం బ్రేక్ వేసిన విషయం తెలిసిందే.