Hardik Pandya : టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సోషల్మీడియాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న యంగెస్ట్ క్రికెటర్గా గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం ఇన్స్టాలో పాండ్యాను 25 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అంటే 25 కోట్ల మంది ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు. ఈ సందర్భంగా తన ఫాలోవర్స్కు ధన్యవాదాలు తెలిపాడు.
‘నాపై ప్రేమ చూపిస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలు. ప్రతి ఒక్క ఫ్యాన్ నాకు చాలా ప్రత్యేకం. ఇన్నేళ్లుగా నాకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కిరికి ధన్యవాదాలు’ అని పాండ్యా సోషల్మీడియా వేదికగా వెల్లడించాడు.
ఆటతో పాటు వెరైటీ హెయిర్ స్టయిల్, డ్రెస్సింగ్తో పాండ్యా అభిమానుల మనసు గెలిచాడు. దాంతో, ఇన్స్టాలో కోట్లాది మంది ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు. టెన్నిస్ లెజెండ్స్ రఫెల్ నాదల్ (17 కోట్లు) రోజర్ ఫెదరర్ (11 కోట్లు), రేసర్ మ్యాక్స్ వెర్స్టప్పెన్ (బెల్జియం – డచ్ 9.5 కోట్లు), నార్వే ఫుట్బాలర్ ఎర్లింగ్ హాలాండ్(24 కోట్లు)లను వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో పోర్చుగల్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నాడు. అతడిని 52 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ 43 కోట్ల మంది ఫాలోవర్స్తో రెండో స్థానంలో ఉన్నాడు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆసియాలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా నిలిచాడు. ఇతడిని ఇన్స్టాలో 22 కోట్ల మందికిపైగా అనుసరిస్తున్నారు.
టీ20 కెప్టెన్గా విజయవంతమైన పాండ్యా పలు ప్రముఖ బ్రాండ్స్కు అంబాసిడర్గా ఉన్నాడు. 20కి పైగా బ్రాండ్స్ ప్రచారకర్తగా పెద్దమొత్తంలో ఆర్జిస్తున్నాడు. క్రీడా వస్తువులు, ఆడియో, డెనిమ్స్, బ్యాటరీస్, ల్యూబ్రికాంట్స్, ఎనర్జీ డ్రింక్స్, బిస్కెట్లు, పర్ఫ్యూమ్స్ కంపెనీలకు పాండ్యా అంబాసిడర్గా కొనసాగుతున్నాడు. పాండ్యా కెప్టెన్సీలో టీమిండియా బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్పై టీ20 సిరీస్లు గెలిచింది. పదిహేనో సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో హార్దిక్ సారథ్యంలోని గుజరాత్ టైటన్స్ ఛాంపియన్గా అవరతరించింది. ఉత్కంఠ రేపిన ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్పై గెలుపొందింది.