మల్యాల, జూన్ 3: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో 80 రోజులపాటు కొనసాగిన అఖండ హనుమాన్ చాలీసా పారాయణం శుక్రవారంతో ముగియనున్నది. వేలాది మంది భక్తుల సమక్షంలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణానికి మార్చి 17న అంకురార్పణ జరగ్గా.. కొండగట్టు అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో జూన్ 4 వరకు పారాయణాన్ని కొనసాగిస్తున్నారు. కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మార్చి 17న ఐదు కోట్ల రామప్రతులను కొండగట్టు ఆలయానికి తీసుకురావడంతోపాటు అఖండ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి నిత్యం సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 వరకు కొండపై ఉండే భక్తులు, అర్చకులు కలిసి పారాయణం చేస్తున్నారు. 11 సార్లు పారాయ ణం చేయడంతోపాటు అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హనుమాన్ ఆలయాల్లో సైతం గంటపాటు భక్తులు పారాయణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు రాష్ర్టాల ప్రజలు వీక్షించేలా భక్తి టీవీ చానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.
పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొండగట్టు అంజన్న సన్నిధిలో నిర్వహిస్తున్న అఖండ హనుమాన్ చాలీసా పారాయణం దిగ్విజయంగా సాగుతుందని ఆమె పేర్కొన్నారు. మార్చి 17 నుంచి కొండగట్టు అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో కొండగట్టులో నిర్వహిస్తున్న అఖండ హనుమాన్ చాలీసా పారాయణం శుక్రవారంతో దిగ్విజయంగా రెండు మండలాల కాలం పూర్తి చేసుకొనున్నదన్నారు. ఈ మహోన్నత ఆధ్యాత్మిక పుణ్యకార్యంలో పాలుపంచుకుంటున్న అశేష భక్త జనం, పూజారులు, పండితులు అందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. కొండగట్టు దేవస్థానం పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు. హెలిప్యాడ్ నిర్మాణ పనులు పూర్తయినట్టు తెలిపారు. కొండగట్టు దేవస్థానం ఆవరణలో రూ.90 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీరామకోటి స్తూపం పనుల్లో లాక్డౌన్ కారణంగా జాప్యం జరిగిందన్నారు. ఈ పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. భక్తులు సిద్ధం చేసిన రామకోటి ప్రతులను, లాక్డౌన్ ముగిసిన తరువాత స్వీకరిస్తామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.