సీఎం కేసీఆర్ క్రికెట్ టోర్నీ విజేతకు ట్రోఫీ ప్రదానం చేసిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో క్రీడలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తూ ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జరిగిన చాంపియన్షిప్లో విజేతగా నిలిచిన ఆరో డివిజన్ జట్టుకు మంత్రి కేటీఆర్ ట్రోఫీ బహుకరించారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో విజేతలను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘యువత క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుంది. ప్లేయర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా నిలుస్తుంది. ఆటలో గెలుపు, ఓటములు సహజం. భవిష్యత్లో హనుమకొండ క్రీడలకు కేంద్ర బిందువుగా మారుతుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు.