హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): పేరుకేమో రెండు జాతీయ పార్టీలు.. ఢిల్లీలో బద్ధ శత్రువుల్లా అనుక్షణం కొంటుకొంటాయి. నువ్వెంతంటే నువ్వెంతని సవాళ్లు విసురుకొంటాయి. రాష్ర్టానికి వచ్చేసరికి దోబూచు రాజకీయాలాడుతుంటాయి. ఒకరికొకరు మేలు చేసుకొంటారు. ఒకరి గెలుపుకోసం మరొకరు త్యాగాలు చేస్తుంటారు. వీళ్లకు సిద్ధాంతాలు లేవు. నిబద్ధత ఉండదు. చిత్తశుద్ధి లేదు.. కావాల్సిందల్లా ఒక్కటే.. రాజకీయంగా నాలుగు ఓట్లు సంపాదించుకోవటం. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని బద్నాం చేయటం.
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కేంద్రంలోని బీజేపీ సర్కారుపై యుద్ధం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసరాల ధరలు పెరగడంపై దేశవ్యాప్తంగా పోరాటం ప్రారంభించింది. రాష్ర్టాల్లో కూడా ఇదే తరహా పోరాటం చేయాలని మార్గనిర్దేశం చేసింది. అయితే కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. బీజేపీ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర రైతులను నట్టేట ముంచేలా కేంద్రం వ్యవహరించినా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదు. కాడి పారేసి బీజేపీకి దాసోహం అయ్యారనే విమర్శలు వినిపించాయి. రాష్ట్రంలో బీజేపీ నాయకులతో కాంగ్రెస్ నేతలు సయ్యాట ఆడుతున్నారని, అన్నదమ్ముల మాదిరిగా అంటకాగుతున్నారని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. బీజేపీ ఆగడాలు, అరాచకాలపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మౌనం వహించటం వెనుక లోగుట్టు ఏమిటీ? ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని, అందుకే పరస్పరం మద్దతు తెలుపుకొంటున్నాయని విశ్లేషకులు అంటున్నారు. రాజకీయంగా అధికార టీఆర్ఎస్ను ఎదుర్కోలేక కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని విశ్లేషిస్తున్నారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలను భారీగా పెంచిన కేంద్రం, సామాన్యులపై పెను భారాన్ని మోపింది. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని రాష్ర్టాల్లో నిరసనలు చేపట్టింది. తెలంగాణలో మాత్రం ఆ పార్టీ తూతూ మంత్రంగా పూర్తి చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎక్కడా ప్రత్యక్షంగా నిరసనల్లో పాల్గొనలేదు.
వాస్తవానికి ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. బాధ్యత మరిచి బాయిల్డ్ రైస్ తీసుకోబోమని షరతు పెట్టి ధాన్యం సేకరణకు నిరాకరించింది. దీంతో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై పెద్ద పోరాటమే చేసింది. అంత జరుగుతున్నా కాంగ్రెస్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయింది. పైగా పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపైనే నిందలు వేసింది. ధాన్యంపై పోరాటంలో ఎక్కడా బీజేపీని తప్పు పట్టకపోవడం వారి మధ్యగల రహస్య ఒప్పందానికి ప్రత్యక్ష ఉదాహరణ అని తెలంగాణవాదులు అంటున్నారు.
ఈ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి పరోక్షంగా అన్ని విధాలుగా సహకరించింది. కాంగ్రెస్ సహకారంతోనే బీజేపీ గెలిచిందని రాజకీయ పండితుల అభిప్రాయం. హుజూరాబాద్లో ఈటల రాజేందర్కు కాంగ్రెస్ దాసోహం అయిందని, కావాలనే అక్కడ బలహీన, కొత్త అభ్యర్థిని నిలబెట్టి కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి పడేలా చేసిందనే విమర్శలతో కాంగ్రెస్లోనే కుమ్ములాటలు చెలరేగిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీపై రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం, కేంద్రంలోని ఖాళీలపై బీజేపీని ప్రశ్నించడం లేదు. కేంద్రం ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తే మన రాష్ట్ర పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. కానీ, కాంగ్రెస్ నేతలు బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర గవర్నర్ తమిళిసై తన పరిధికి మించి ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలో భాగమైన గవర్నర్, ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి ప్రతిపక్షాలకు పక్షం వహిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదులపై గవర్నర్ ఆగమేఘాలమీద స్పందించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ రహస్య ఒప్పందంలో భాగంగానే ఇదంతా జరుగుతున్నదనే అనుమానాలు ఉన్నాయి.