అహ్మదాబాద్ : మునుపెన్నడూ లేని విధంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా గుజరాత్ ప్రభుత్వం మరో తొమ్మిది నగరాల్లో కర్ఫ్యూ విధించింది. హిమ్మత్నగర్, పాలన్పూర్, నవసారి, వల్సాద్, పోర్బంద్, బోటాడ్, విరామ్గామ్, చోటా ఉదయ్పూర్, వెరావల్ సోమ్నాథ్లో నైట్ కర్ఫ్యూ అమలులోకి రానుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుందని గుజరాత్ సీఎంఓ తెలిపింది. ఇప్పటికే ఎనిమిది ప్రధాన నగరాలు సహా 20 పట్టణాల్లో రాత్రి కర్ఫ్యూ అమలవుతుండగా.. మొత్తం నగరాల సంఖ్య 29కి చేరింది.
సీఎం విజయ్రూపానీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు ఆంక్షలను సైతం విధించారు. 29 నగరాల పరిధిలో మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, సినిమా థియేటర్లు, ఆడిటోరియంలు, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్, వాటర్ పార్క్లు, పబ్లిక్ గార్డెన్స్, సెలూన్స్, స్పాలు మూసివేయనున్నారు. అన్ని వ్యవసాయ ఉత్పత్తి, పశువుల మార్కెట్ కమిటీలు మూతపడనున్నాయి. కూరగాయలు, పండ్ల సంబంధిత మార్కెట్లు, దుకాణాలు కొనసాగుతాయని సీఎంఓ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు, ప్రార్థనా మందిరాలు మూతపడనున్నాయి.
అర్చకులు, నిర్వాహకులు మాత్రమే పూజలు చేసేందుకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పింది. రాష్ట్రంలో ఆర్టీసీ సర్వీసులు కొనసాగుతాయని, కేవలం 50శాతం సామర్థ్యంతో కొనసాగిస్తున్నట్లు తెలిపింది. వివాహ వేడుకల్లో గరిష్ఠంగా 50 మందికి, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 20 మందికి అనుమతి ఉంటుందని చెప్పింది. మే 1 నుంచి 18-45 సంవత్సరాల వయస్సున్న వారికి కొవిడ్ టీకాలు ఉచితంగానే వేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సీరం సంస్థకు కోటి, భారత్ బయోటెక్కు 50 లక్షల మోతాదులకు ఆర్డర్ ఇచ్చినట్లు పేర్కొంది.