అహ్మదాబాద్ : కరోనా వైరస్ రాకుండా తీసుకొచ్చిన వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న తర్వాత కూడా ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. ఇది గుజరాత్లో కలకలం రేపుతున్నది. సదరు వ్యక్తి ఆరోగ్య శాఖకు చెందినవాడు కావడం మరింత భయపెడుతున్న విషయం. వ్యాప్తికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ అభివృద్ధి చెందడానికి సాధారణంగా 45 రోజుల సమయం పడుతుందని అక్కడి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సెలవిస్తున్నారు.
గాంధీనగర్లోని దెహ్గాం తాలూకాకు చెందిన ఆరోగ్య శాఖ అధికారి జనవరి 16న కరోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నాడు. రెండో డోసును గత నెల 15 న పొందాడు. రెండు మూడు రోజుల తర్వాత జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన శాంపిల్స్ను పరీక్షల నిమిత్తం పంపారు. అక్కడ కరోనా పాజిటివ్గా నిర్ధారించారు. ఈ విషయాన్ని గాంధీనగర్ చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎంహెచ్ సోలంకి ధ్రువీకరించారు. ఆయన శాంపిల్లో చాలా తక్కువ లక్షణాలు కనిపించాయని, సోమవారం నుంచి విధుల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపారని సోలంకి తెలిపారు. టీకా రెండు మోతాదులను అందించిన తర్వాత వ్యాప్తికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ అభివృద్ధి చెందడానికి సాధారణంగా 45 రోజులు పడుతుందని ఆయన చెప్పారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ముక్కుకు మాస్క్ను తప్పకుండా ధరించాలని, మిగతా కరోనా మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మళ్లీ కరోనా సోకడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయని ప్రజలు గమనిస్తున్నారు. ఇలా ఉండగా, గుజరాత్లో ఇప్పటివరకు 2,72,240 కేసులు నమోదవగా.. 4,412 మంది చనిపోయారు.