న్యూఢిల్లీ : ఎంఎస్పీ తదితర అంశాలపై చర్చ కోసం కమిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంయుక్త కిసాన్ మోర్చా (SKM) నుంచి ఐదుగురి పేర్లను ప్రతిపాదించాలని కోరిందని రైతు సంఘం నేత దర్శన్పాల్ తెలిపారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రైతులు నిరసిస్తూ ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో పార్లమెంట్లో ఆ చట్టాలను రద్దు చేసిన అనంతరం కేంద్రం నుంచి ఈ పిలుపు వచ్చింది.
పంటలకు కనీస మద్దతు ధర (MSP) అంశంపై చర్చించే కమిటీకి ఐదుగురి పేర్లను కేంద్రం కోరిందని, అయితే ఇంకా పేర్లను నిర్ణయించలేదని దర్శన్పాల్ పేర్కొన్నారు. డిసెంబర్ 4న జరిగే సమావేశంలో పేర్లపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 40కిపైగా ఉన్న రైతు సంఘాలకు సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చట్టాల రద్దు, ఎంఎస్పీకి చట్టపరమైన హామీతో పాటు పలు డిమాండ్లు కేంద్రం ముందుంచిన విషయం తెలిసిందే.
జీరో బడ్జెట్ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, మారుతున్న అవసరాలకు అనుగుణంగా పంటల విధానాలను మార్చడం, ఎంఎస్పీని మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా మార్చడం తదితర అంశాలపై అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించిన విషయం విదితమే. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందంటూ జాతినుద్దేశించి చేసిన ప్రసంగించిన సమయంలో ప్రధాని ఈ ప్రకటన చేశారు.