హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించడం అద్భుతమని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లాలాగూడ-2లో పనిచేస్తున్న మ్యాథ్స్ టీచర్ చిలుక ఉమారాణి పేర్కొన్నారు. ఇంగ్లిష్ మీడియం అమల్లోకి వస్తే ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడులకు వలసలు వరద ప్రవాహంలా ఉంటాయని చెప్పారు. పేదలకు ఫీజుల భారం నుంచి విముక్తి కలుగుతుందని తెలిపారు. టీచర్లు తెలుగు మీడియంలో చదివినప్పటికీ కొద్దిగా కసరత్తు చేస్తే ఆంగ్లంలో బోధించడం కష్టమేమి కాదని చెప్పారు. తాము 2003-04 లోనే ప్రయోగాత్మకంగా ఆంగ్లంలో బోధించి విజయం సాధించామని తెలిపారు. ఆ అనుభవం ఉమారాణి మాటల్లోనే..
40 మందితో ఆంగ్లమాద్యమం ప్రారంభం
కొత్తగూడెంలోని సింగరేణి పాఠశాలలో తెలుగు మాధ్యమంలో నేను చదివా. 10వ తరగతిలో ఇంగ్లిష్ బోధించిన ప్రిన్సిపాల్ మేరీ విజయ నాకు ఆదర్శం. ఆమె స్ఫూర్తితో 2003-04లో 40 మంది విద్యార్థులతో లాలాపేటలోని ఆర్యవాటిక (వినోభానగర్) పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించాం. తల్లిదండ్రుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ప్రైవేటు నుంచి కూడా వచ్చి చేరారు. ఉపాధ్యాయులమంతా తెలుగు మీడియం కావడంతో ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)కు ఉదయం, సాయంత్రం వెళ్లి ఆంగ్లంలో పట్టు సాధించాం. రెండో ఏడాది నుంచి విద్యార్థులను ఆంగ్లంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేశాం. ఉపాధ్యాయులమంతా బృందంగా ఏర్పడి యాక్టివిటీ రూపం లో పదసంపదను పెంపొందించాం. ఈ విషయాన్ని యజ్ఞంలా భావించి కష్టపడ్డాం. అప్పటి విద్యార్థులు గత ఏడాది కొవిడ్కు ముందు పీజీ పూర్తిచేశారు. చొరవ తీసుకొని ఆంగ్లమాధ్యమంలో ఆధునిక పద్ధతులో బోధనకు నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఎన్ఐసీటీ) 2017 ఏడాదికి అవార్డు ప్రకటించింది.
ఆంగ్లమాధ్యమంతో లాభాలు
మెడిసిన్, ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ లాంటివే కాకుండా అగ్రికల్చర్ విభాగంలో కూడా సమాచారాన్ని సేకరించాలంటే ఆంగ్లంపై స్పష్టత రావాలి. ఎక్కువ అవకాశాలు ఇంగ్లిష్ మీడియంలో చదివిన వారికే వస్తున్నాయి. తెలుగు ఒక సబ్జెక్టుగా ఉంటున్నందున మాతృభాషకూ భంగం కలుగదు. ఇంగ్లిష్ మీడియం వల్ల విద్యార్థులకు లాభాలే ఎక్కువ. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి అమలు చేయడానికి పూనుకోవడం హర్షించదగినది. ఈ నిర్ణయం పేదలు, అణగారినవర్గాలతో అన్ని వర్గాలకూ ఉపయుక్తం. కార్పొరేట్ స్థాయిలో పోటీపడి రాణించే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఇంగ్లిష్లో ప్రావీణ్యం సాధించాక ఆత్మన్యూనతా భావం నుంచి బయటపడే అవకాశం ఉన్నది.