మంచిర్యాల : ఏ పేదింటి తండ్రి తన బిడ్డ పెండ్లికి అగచాట్లు పడకూడదన్న సంకల్పం నుంచి స్వరాష్ట్రంలో పురుడుపోసుకున్న అపూర్వ పథకం కల్యాణ లక్ష్మి అని ప్రభుత్ విప్ బాల్క సుమన్ కొనియాడారు.
చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని 569 మంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదింటి ఆడబిడ్డలకు మేనమామ కట్నంగా సీఎం కేసీఆర్ గడచిన ఏడేళ్లలో 10 లక్షల మంది పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించినట్లు గుర్తచేశారు.
ఇంత గొప్ప పథకంపై మహిళలు తమ గ్రామాల్లో చర్చ చేయాలని కోరారు. పథకం ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విప్ పిలుపునిచ్చారు. మహిళల స్వయంకృషితో ఆర్థికంగా ఎదగాలనే గొప్ప లక్ష్యంతో సుమారు రూ.15 కోట్లతో రానున్న రోజుల్లో చెన్నూరు నియోజకవర్గంలోని 102 గ్రామాల్లో 102 సమ్మక్క- సారలమ్మ మహిళా భవన్ లను నిర్మిస్తున్నామన్నారు.
కొద్ది రోజుల్లో టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి వీటి నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పారు. మహిళా అభ్యున్నతిలో రాష్ట్రంలోనే గొప్ప నియోజకవర్గంగా చెన్నూరును తీర్చిదిద్దుతామని విప్ పేర్కొన్నారు.