మహబూబ్నగర్ : నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు చూడాల్సిన అవసరం ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సబ్ కి యోజన సబ్ కి వికాస్, జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2022-23 పై నిర్వహించిన జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ పథకం కింద ప్రభుత్వ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం అమలు చేస్తామని తెలిపారు. ఇందుకు జెడ్పీటీసీలు, ఎంపీపీలు పనుల ప్రతిపాదనలు వెంటనే పంపాలని సూచించారు. దేశంలో అత్యధికంగా 55 వేల కోట్ల రూపాయల రెవెన్యూ తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి ఇస్తున్నదని, అత్యధిక జీడీపీ ఇచ్చే రాష్ట్రాలలో తెలంగాణ రెండోదని తెలిపారు.
దళిత బంధు ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందని, దీనిపై జెడ్పీటీసీలు, ఎంపీపీలు అవగాహన కలిగి ఉండాలన్నారు. మన ఊరు -మన బడి కార్యక్రమం కింద రాష్ట్రంలోని పాఠశాలల రూపురేఖలను మార్చాలన్న కృత నిశ్చయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని తెలిపారు.
అదేవిధంగా చిన్నపిల్లలకిస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ , ఇతర పథకాల అమలులో ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలని ఆదేశించారు. వేసవిలో గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, జెడ్పీ సీఈవో జ్యోతి ఉన్నారు.