అందోల్, సెప్టెంబర్ 20 : ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసింది. దవాఖానల్లో మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరిన్ని మెరుగైన వసతులు కల్పనకు చర్యలు చేపడుతూ నిధులు మం జూరు చేస్తున్నది. అందోల్ నియోజకవర్గంలోని అందోల్ మండలం తాలెల్మ, మునిపల్లి, రాయికోడ్ మండల కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్సీ) దవాఖానల మరమ్మతులు, ఇతర మౌలిక వసతులు కల్పనకు నిధులు మంజూరుచేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అందోల్ మండలం తాలెల్మకు రూ.4లక్షలు, రాయికోడ్కు రూ.4లక్షలు, మునిపల్లికి రూ.4.5లక్షలు, మెదక్ జిల్లా అల్లాదుర్గానికి రూ.30లక్షలు మంజూరు చేశారు. నిధుల మంజూరుకు కృషిచేసినందుకు ప్రజలు, నాయకులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్యం అందుతుండగా, మరిన్ని మౌలిక వసతుల కల్పనకు నిధులు మం జూరు చేయాలని ఎమ్మెల్యే మంత్రి హరీశ్రావును కోరారు. స్పందించిన మంత్రి మూడు ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో రోగులకు అవసరమైన వసతులు కల్పించడం, పరికరాల కొనుగోలుకు ఖర్చుచేయనున్నారు.ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం అందించేందుకు కృషిచేస్తున్నది.
సీఎం కేసీఆర్ సహకారంతో మునుపెన్నడూలేని విధంగా ప్రైవేట్ దవాఖానలకు దీటుగా ప్రభుత్వ దవాఖానలు తీర్చిదిద్దుతున్నాం. సీఎం కృషితో ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందుతున్నది. ఆర్థిక పరిస్థితి సరిగా లేనివారికి సీఎం రిలీఫ్ఫండ్ అందజేస్తూ అండగా ఉంటున్నది. నియోజకవర్గంలో ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, మౌలిక వసతుల కల్పనలకు నిధులు కావాలని అడిగిన వెంటనే మంత్రి హరీశ్రావు నిధులు మంజూరు చేశారు. అభివృద్ధి విషయంలో అన్ని విధాలుగా అండగా ఉంటున్న మంత్రి, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-చంటి క్రాంతికిరణ్, ఎమ్మెల్యే, అందోల్