హైదరాబాద్ : దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గిరిజిన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కాలరీస్ ఫంక్షన్ హాలులో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రాతో కలిసి అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.3016 పెన్షన్ ఇస్తుందన్నారు. త్వరలో రాష్ట్రంలోనే కృత్రిమ అవయవాల తయారీ కేంద్రం ఏర్పాటు కానుందని చెప్పారు.
రాష్ట్రంలో అంగన్వాడీలకు ఉన్న గౌరవం, వేతనాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. కరోనా సమయంలో అంగన్వాడీలు చేసిన సేవలకు రాష్ట్రపతి అవార్డు వచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన విధంగా అంగన్వాడీలు తల్లి, బిడ్డలు, గర్భిణుల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. ఇటీవల కేంద్రం దృష్టికి తీసుకెళ్లి.. కరోనా వారియర్స్గా గుర్తించి, బీమా సౌకర్యం కల్పించాలని కోరగా.. సానుకూలంగా స్పందించిందన్నారు.
ప్రస్తుతం అంగన్వాడీలకు రూ.50లక్షల బీమా సౌకర్యం ఉందని చెప్పారు. అంగన్వాడీలకు రిటైర్మెంట్ వయసు, ప్రయోజనాలు కల్పించే విధానం త్వరలో రానుందని తెలిపారు. పిల్లల వయసుకు తగిన విధంగా ఎత్తు, బరువు పెరిగే అంశాన్ని పర్యవేక్షించే గ్రోత్ మానిటరింగ్ అమలు చేస్తున్నారని అభినందించారు. తల్లిదండ్రుల తర్వాత గురువు అంటారని.. అంగన్వాడీలు భోజనం పెట్టడంలో తల్లిదండ్రులుగా, విద్యాబుద్ధులు చెప్పడంలో గురువుగా పని చేస్తున్నారన్నారు.