న్యూఢిల్లీ : వరుసగా రెండో క్వార్టర్లో అంచనాల కంటే రాబడి తగ్గిన అనంతరం ఉద్యోగుల ట్రావెల్, వినోద బడ్జెట్లో గూగుల్ కోత విధించింది. గత వారం నిర్వహించిన ఆల్ హ్యాండ్స్ మీటింగ్లో ఉద్యోగులు ఈ విషయంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ను ప్రశ్నించారు. ఉత్పాదకత, లేఆఫ్స్, వినోద బడ్జెట్లో కోతల వంటి పలు అంశాలను ఉద్యోగులు ఈ సందర్భంగా ఆయనతో ప్రస్తావించారు.
ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ వివరణ ఇస్తూ డబ్బు, అలవెన్సులే సర్వస్వం కాదని, బడ్జెట్లు, ఉద్యోగి ప్రయోజనాల్లో కోతలపై బాధపడే బదులు సరదాగా పనిచేయడంపై దృష్టిసారించాలని పేర్కొన్నట్టు సమాచారం. రికార్డు లాభాలతో పాటు భారీ నగదు నిల్వలున్న సమయంలో ట్రావెల్, వినోద బడ్జెట్లలో ఎందుకు కోత విధించారని ఈ సెషన్లో ఉద్యోగులు ప్రశ్నించారు.
స్ధూల ఆర్ధిక పరిస్ధితులను ఉద్యోగులు సమిష్టిగా ఎదుర్కోవాలని, మీరంతా బయట వార్తలు చదువుతుంటారని తాను భావిస్తున్నానని, అయితే గత పదేండ్లుగా సంక్లిష్ట స్ధూల ఆర్ధిక పరిస్ధితుల్లో మనం సాగుతున్నామని, మనం బాధ్యతగా ఇలాంటి స్ధితిలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని పిచాయ్ పేర్కొన్నట్టు ఓ ఆడియో క్లిప్ వెలుగుచూసింది.
మనం ఎప్పుడూ పనిని ఆస్వాదించడాన్ని డబ్బుతో పోల్చలేమని, స్టార్టప్లో ఉద్యోగులు శ్రమకోర్చి పనిని ఎంజాయ్ చేస్తుంటారని దాన్ని డబ్బుతో పోల్చలేమని చెప్పుకొచ్చారు. నియామక ప్రక్రియను గూగుల్ నెమ్మదించిన విషయాన్ని కూడా ఈ సమావేశంలో పిచాయ్ ప్రస్తావించారు. గూగుల్లో పెద్దసంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తుండగా ఆ మేరకు ఉత్పాదకత ఉండటం లేదని కూడా స్పష్టం చేశారు.