యాదగిరిగుట్ట రూరల్, మార్చి 21 : గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ యాదాద్రి లక్ష్మీనరసింహుడి సన్నిధికి చేరాయి. రెండ్రోజుల క్రితం మల్లన్న సాగర్ నుంచి విడుదలైన కాళేశ్వరం నీళ్లు గండి చెరువును తాకాయి. సోమవారం ఉదయం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి పూజలు చేసి గండి చెరువుకు వెళ్లే కాల్వ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ రాగి బిందెలో పుణ్యజలాన్ని తీసుకెళ్లగా.. వాటితో యాదాద్రి ఆలయం, యాగశాల సంప్రోక్షణ, పుణ్యాహవాచనం, స్వామివారికి అభిషేకం చేయడం విశేషం.
యాదగిరిగుట్ట రూరల్, మార్చి 21 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చెంత గోదావరి జలాలు సవ్వడి చేశాయి. స్వామి వారి తెప్పోత్సవానికి నిర్వహించే గండి చెరువును గోదావరి జలాలతో నింపాలనే ప్రభుత్వ సంకల్పం సోమవారం నెరవేరింది. యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణ వేడుకల్లో భాగంగా మహాయాగం అంకురార్పణ పూజకు గోదావరి జలాలు గలగలమంటూ గండి చెరువులోకి దూకాయి. మండలంలోని జంగంపల్లి ఓటీ-2 కాల్వ నుంచి యాదాద్రి క్షేత్ర సమీపంలోని గండి చెరువులోకి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి సోమవారం అట్టహాసంగా నీటిని వదిలారు. మొదట అక్కడ పూజలు చేసి నీటిలో పూలు చల్లారు. అనంతరం నీటిని వదిలారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను ప్యాకేజీ-15, ప్యాకేజీ-16, ఓటీ-2 ద్వారా యాదాద్రి క్షేత్రం పరిధిలోని గండి చెరువుకు నీటిని తరలించారు. ప్యాకేజీ-15 ప్రారంభమైన కొడకండ్ల రెగ్యులేటర్ నుంచి నీటిని గండిచెరువు నింపడానికి వదిలారు. ఈ నీరు ప్యాకేజీ-15లో 36 కిలోమీటర్లు, ప్యాకేజీ-16లో 5 కిలోమీటర్లు ప్రవహించి యాదగిరిగుట్ట మండలం జంగంపల్లి వద్ద నిర్మించిన ఓటీ-2 తూము వద్దకు చేరాయి. ఇక్కడి నుంచి దాతరుపల్లి, మల్లాపురం గ్రామాల మీదుగా పది కిలోమీటర్లు ప్రవహించి గండి చెరువులోకి చేరాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ గోదావరి జలాలు యాదాద్రి స్వామి చెంతకు చేరడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ అన్న మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. స్వామి వారి తెప్పోత్సవాన్ని గండి చెరువులోనే నిర్వహించనుండగా ఆలయానికి, భక్తులకు అవసరమైన నీటిని ఇక్కడి నుంచే అందించనున్నట్లు ప్రభుత్వ విప్ తెలిపారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, సర్పంచులు గుండ్ల సరిత, బైరుగాని పుల్లయ్య తోటకూరి బీరయ్య, దాతరుపల్లి ఎంపీటీసీ కాల్నె అయిలయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పత్తిపాటి మంజుల, నాయకులు మిట్ట వెంకటయ్య, బబ్బూరి రవీందర్గౌడ్, బద్దూనాయక్, కాల్నె భాస్కర్, ఎండీ యాకూబ్, సున్నం లక్ష్మయ్య, అధికారులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్ : దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకం అమలు చేస్తూ సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నారని ప్రభుత్వవిప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. 2015-16లో నియోజకవర్గంలో సుమారు 12 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.6 లక్షల చొప్పున మంజూరైన చెక్కులను సోమవారం యాదగిరిగుట్టలో అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు పని చేస్తున్నదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల కష్టాలు చూసిన కేసీఆర్ స్వరాష్ట్రంలో రైతులకు ఆ కష్టాలు ఉండకూడదనే సదుద్దేశంతో అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ ఎరుకుల సుధ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, సర్పంచులు తోటకూరి బీరయ్య, ఆరె స్వరూప, కొండ అరుణ, నాయకులు రేపాక స్వామి, కసావు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రానికి చెందిన ఎలిమినేటి యాదిరెడ్డి, కొరటికల్కు చెందిన జక్క రాంరెడ్డి మూడేండ్ల క్రితం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.5 లక్షల చెక్కులను సోమవారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి యాదగిరిగుట్టలోని ఆమె నివాసంలో అందజేశారు. రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ యాస రంగారెడ్డి, ఆర్ఐ యాదగిరి, కొరటికల్ సర్పంచ్ కోల సత్తయ్యగౌడ్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు సైదులు, శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పురుషోత్తం పాల్గొనారు.