హైదరాబాద్ : గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) కో ఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశం ఇవాళ జరుగనుంది. అయితే, దీనికంటే ముందుగా పూర్తిస్థాయి బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయాలని జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శికి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు. ఈ క్రమంలో నేడు హైదరాబాద్లో జరిగే సమావేశంపై సందిగ్ధం నెలకొన్నది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి అనుగుణంగా కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానుండగా ఆలోపు పూర్తిచేయాల్సిన కార్యాచరణపై కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులు కసరత్తు చేస్తున్నాయి. ఇందుకోసం సమన్వయ కమిటీలు ఏర్పాటుచేశారు.
ఈ క్రమంలో రెండుబోర్డులు సమన్వయ కమిటీ తొలిసమావేశాన్ని మంగళవారం ఏర్పాటు చేశాయి. బోర్డులకు సంబంధించిన ఉద్యోగుల నియామకం, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్పై దృష్టి పెట్టాలన్న సూచనల మేరకు కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ నిర్ణయించాయి. ముందుగా బోర్డు మీటింగ్ నిర్వహించాలని తెలంగాణ కోరింది. ఆ లేఖపై స్పందించిన జీఆర్ఎంబీ నోటిఫికేషన్ అమలుకు నిర్ధిష్ట గడువులతో తక్షణ కార్యాచరణ ఖరారు చేయాలని కేంద్ర జలశక్తిశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని పేర్కొన్నారు. అమలు కార్యాచరణ, గడువులపై సమన్వయ కమిటీలో.. చర్చించాల్సిన అవసరం ఉందని, వాటిపై చర్చించి తగిన చర్యలు తీసుకున్న తర్వాత.. బోర్డు పూర్తిస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.