వేమనపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి డివిజన్ పరిధి వేమనపల్లి పంచాయతీ పరిధిలోని ఒడ్డుగూడం గ్రామానికి చెందిన మేకల కాపరి ఎనుముల శంకర్పై గురువారం పెద్దపులి దాడి చేసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడ్డుగూడెం ఫారెస్టు బీట్ పరిధిలో మేకలను మేపుతుండగా మధ్యాహ్నాం 3 గంటల ప్రాంతంలో వెనక వైపు నుంచి పెద్దపులి దాడి చేసిందన్నాడు. దీంతో తన చేతిలో ఉన్న గొడ్డలితో పులిముఖంపై కొట్టడంతో పులి పారిపోయిందని తెలిపాడు. దీంతో తాను అక్కడ నుంచి మేకలను తీసుకుని గ్రామంలోకి పరిగెత్తుకు వచ్చినట్లు తెలిపాడు. కాగా పులి దాడిలో శంకర్ భుజానికి , ఎడమ మెడ భాగాన గాయాలయ్యాయి.
దీంతో కుటుంబీకులు శంకర్ను వేమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా వైద్యుడు కృష్ణ ప్రాథమిక చికిత్స అందజేశారు. తాసీల్దార్ మధుసూదన్ , సర్పంచు కుబిడె మధుకర్లు ఆసుపత్రికి వెళ్లి బాధితున్ని పరామర్శించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్లో మంచిర్యాలలోని దవాఖానకు తరలించారు. మంచిర్యాలలో చికిత్సపొందుతున్న బాధితుడు శంకర్ను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురువారం రాత్రి పరామర్శించారు. ఒడ్డుగూడెం గ్రామానికి 500 మీటర్ల దూరంలో పులి దాడి జరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కల్లెంపల్లి, జాజులపేట, సుంపుటం , రాజారాం, చామనపల్లి, బమ్మెన తదితర గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పులి నుంచి అధికారులు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.