చెన్నై : దిగ్గజ గాయకుడు ఘంటసాల రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన గురువారం ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల కిందట ఆయనకు కరోనా సోకగా చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజుల కిందట నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చింది. అయితే, చాలా రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో రత్నకుమార్ బాధపడుతున్నారు. దీంతో ఆయన కొన్ని రోజులుగా డయాలసిస్పై ఉన్నారు.
ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఘంటసాల రత్నకుమార్ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాలకు రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు. వెయ్యికిపైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పగా.. హీరోలు సల్మాన్ఖాన్, షారుఖ్ ఖాన్తో పాటు అర్జున్, కార్తీక్, అరవింద్ స్వామికి ఎక్కువగా గాత్రదానం చేశారు. ఆట ఆరంభం, వీరుడొక్కడే, అంబేద్కర్తో పాటు 30కిపైగా సినిమాలకు మాటలు అందించారు.