బోథ్, మార్చి 24 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పిలుపు నిచ్చారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చెర క్రాస్రోడ్డులో గల ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి హాజరై మాట్లాడారు. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్రంపై తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తరహాలో పోరాడే సమయం ఆసన్నమైందన్నారు. వరి ధాన్యం కొనడం లేదని, మిగతా పంటల కొనుగోళ్లలో కూడా కోతలు విధిస్తున్నదన్నారు. బీజేపీ అసంబద్ధ, అసత్య ప్రచారాలకు భయపడేది లేదన్నారు. ఎప్పటికప్పుడు నాయకులు, కార్యకర్తలు ఎండగట్టాలన్నారు. ఈ సమావేశంలో బోథ్, నేరడిగొండ ఎంపీపీలు తుల శ్రీనివాస్, రాథోడ్ సజన్, జడ్పీటీసీ సంధ్యారాణి, టీఆర్ఎస్ మండలాల కన్వీనర్లు రుక్మణ్సింగ్, శివ్వారెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల భోజన్న, వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, ఆత్మ చైర్మన్లు, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.