చనిపోయే ముందు మానవ శరీరంలో ఏ మార్పులు జరుగుతాయి? మెదడు పనితీరు ఎలా ఉంటుంది? ఎలాంటి ఒత్తిడికి లోనవుతుంది? అందులో జరిగే మార్పులను రివర్స్ చేస్తే మనిషి బతుకుతాడా? ఇలాంటి ఎన్నో అనుమానాలపై పరిశోధకులు అధ్యయనం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ మార్పులను రివర్స్ చేయలేమని, మనిషిని తిరిగి బతికించలేమని 2018లో జరిగిన పరిశోధనల్లో తెలుసుకున్నారు. అయితే తాజా పరిశోధనల్లో దానికి భిన్నమైన ఫలితాలు వచ్చాయి. అవేంటి?
ఎనర్జీ సేవింగ్ మోడ్లోకి మెదడు..
సెల్ఫోన్లో చార్జింగ్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ఛాఫ్ కాకుండా ఉండేందుకు ‘ఎనర్జీ సేవింగ్ మోడ్’లో పెడతాం. ఇలాగే శరీరానికి 20 నుంచి 40 సెకండ్ల వరకు ఆక్సిజన్ అందకపోతే (అనాక్సియా) మెదడు కూడా ‘ఎనర్జీ సేవింగ్ మోడ్’లోకి వెళ్తుందట. అప్పుడు నాడీ కణాలు నిష్క్రియాత్మకంగా ఉండిపోతాయి. అప్పటికీ ఆక్సిజన్ అందకపోతే కొద్ది నిమిషాల తర్వాత కణాల్లోని అయాన్ గ్రేడియెంట్ చెల్లాచెదురు కావడంతో మెదడు ‘బ్రేక్ డౌన్’అవుతుంది. దీనివల్ల ఎలక్ట్రో కెమికల్ ఎనర్జీ తరంగాలు (డీపోలరైజేషన్) ఉత్పత్తి అవుతాయి. దీన్నే ‘మెదడు సునామీ’ అంటారు. ఈ తరంగాలు మెదడులోకి అన్ని భాగాలకు విస్తరిస్తాయి.
మార్పులను మానిటర్ చేశారు..
జర్మనీలోని యూనివర్సిటీ మెడిసిన్ గాటింగెన్కు చెందిన జెన్స్ డ్రీయర్ నేతృత్వంలోని బృందం దీనిపై పరిశోధన చేసింది. సబ్ డ్యూరల్ ఎలక్ట్రోడ్ స్ట్రిప్స్, ఇంట్రాపారంకైమల్ ఎలక్ట్రోడ్ ఆర్రే అనే సాంకేతికతల ద్వారా తొలిసారిగా మెదడులో జరిగే మార్పులను నేరుగా గమనించింది. మెదడుకు తీవ్రంగా గాయాలైన తొమ్మిది మంది వ్యక్తులపై పరిశోధనా బృందం సభ్యులు ఈ పరిశోధనలు చేశారు. ఈ బ్రెయిన్ మరణాన్ని ఆపడం సాధ్యమేనని గుర్తించారు. డీపోలరైజేషన్ జరిగి మెదడులో సునామీ ఏర్పడకముందే ఆక్సీకరణ చర్యలు పునరుద్ధరిస్తే మెదడును చనిపోకుండా ఆపొచ్చని జెన్స్ డ్రీయర్ చెబుతున్నారు. ఈ దిశగా ప్రయోగాలు జరిపితే భవిష్యత్తులో బ్రెయిన్ స్ట్రోక్ లేదా మెదడుకు రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల జరిగే నష్టాన్ని అరికట్టి వారిని బతికించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.