న్యూఢిల్లీ, నవంబర్ 22: టెలికం దిగ్గజం రిలయన్స్ జియోకు తొలిసారి షాక్ తగిలింది. ప్రతి నెల లక్షల్లో కస్టమర్లను ఆకట్టుకుంటున్న జియో..సెప్టెంబర్లో 1.9 కోట్ల మంది కస్టమర్లను కోల్పోయింది. దీంతోపాటు వొడాఫోన్ ఐడియాకు 10.77 లక్షల మంది గుడ్బై పలికారు. కానీ, భారతీ ఎయిర్టెల్ మాత్రం 2.74 లక్షల మంది కొత్తగా చేరినట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ వెల్లడించింది. ఆగస్టులో 35.41 కోట్ల మంది వినియోగదారులు కలిగివున్న ఎయిర్టెల్.. సెప్టెంబర్ చివరినాటికి 35.44 కోట్లకు చేరుకున్నారు. దేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్ రిలయన్స్ జియో 1.90 కోట్ల మంది సబ్స్ర్కైబర్లను కోల్పోయి 42.48 కోట్లకు తగ్గారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ను 10.77 లక్షల మంది వదులుకున్నారు. దీంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 26.99 కోట్లకు పరిమితమయ్యారు.