హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : వరంగల్ రైతు సంగ్రామ సభలో కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. తెలంగాణ రైతాంగం పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అంత ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు.
బుధవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చే కమీషన్లకు ఆశపడే పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే 14 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇబ్బందులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ది 420 ఫ్యామిలీ కాదని, రాహుల్గాంధీదే దేశంలోనే 420 కుటుంబమని దుయ్యబట్టారు. ఉద్యమ చరిత్ర కలిగిన కేసీఆర్, కేటీఆర్పై ఇష్టారీతిన మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు.