న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లోనూ దేశ జీడీపీ మందగించింది. క్యూ3లో 5.4 శాతం (రూ.38,22,159 కోట్లు)గా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) క్యూ3లో 0.7 శాతంగా ఉన్నట్టు సోమవారం జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) తెలిపింది. అయితే లోబేస్ కారణంగానే అంతకుముందు రెండు త్రైమాసికాల్లోనూ వృద్ధిరేటు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. తొలి త్రైమాసికం ఏప్రిల్-జూన్లో 20.3 శాతంగా, రెండో త్రైమాసికం జూలై-సెప్టెంబర్లో 8.5 శాతంగా ఉన్నది. ఈ మూడో త్రైమాసికంలోనూ లోబేస్ ఎఫెక్ట్ కనిపించగా, అయినప్పటికీ ప్రతీ త్రైమాసికానికి జీడీపీ పడిపోతుండటం గమనార్హం. కరోనా నేపథ్యంలో వచ్చిపడిన లాక్డౌన్లతో గత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు పడకేసిన సంగతి విదితమే. దాన్నిబట్టి చూస్తేనే ఈ వృద్ధిరేటైనా కనిపిస్తున్నది. అయితే క్రమేణా ఇదికూడా తగ్గిపోతుండటం దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
దేశంలో అన్ని రంగాలు డీలా పడినట్టు తాజా గణాంకాలతో స్పష్టమవుతున్నది. కీలకమైన తయారీ రంగంలో వృద్ధిరేటు దాదాపు శూన్యంగా ఉండటం గమనార్హం. క్యూ3లో 0.2 శాతంగానే ఉన్నది. నిరుడు ఇదే సమయంలో 8.4 శాతంగా ఉండటం విశేషం. గతంతో పోల్చితే వ్యవసాయంలోనూ 4.1 శాతం నుంచి 2.6 శాతానికి వృద్ధి మందగించింది. నిర్మాణ రంగంలోనైతే 2.8 శాతం క్షీణత నమోదైంది. నిరుడు 6.6 శాతం వృద్ధి కనిపించింది. గనులు, విద్యుత్తు, గ్యాస్, నీటి సరఫరాల్లో వృద్ధి నమోదైంది.
మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను జీడీపీని 8.9 శాతంగా ఎన్ఎస్వో అంచనా వేసింది. అయితే గతంలో 9.2 శాతంగా వృద్ధిరేటును అంచనా వేయడం గమనార్హం. దీంతో ఈసారి అంచనాల్లో 0.3 శాతం తగ్గుదల కనిపించింది. ఇక గత ఆర్థిక సంవత్సరం మైనస్ 6.6 శాతంగా జీడీపీని ఎన్ఎస్వో ఈ సందర్భంగా సవరించింది. అంతకుముందు దీన్ని 7.3 శాతంగా అంచనా వేసినది తెలిసిందే. మొత్తానికి కరోనా ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకున్నదని, ఇక రెండంకెల వృద్ధి దిశగా వెళ్తామని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు చెప్తున్న నేపథ్యంలో తాజా గణాంకాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఇక ఇప్పటికీ ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ భారతేనని కేంద్రం చెప్తున్నది.
జనవరి నెలకుగాను కీలక రంగాలు 3.7 శాతం వృద్ధిని కనబరిచాయి. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 1.3 శాతంతో పోలిస్తే ఇది రెండు రెట్లు అధికం. బొగ్గు, సహజ వాయువు, సిమెంట్ రంగాలు అంచనాలకుమించి వృద్ధిని కనబరచడం ఇందుకు దోహదం చేశాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. కానీ, క్రూడాయిల్, ఎరువులు మాత్రం ప్రతికూలానికి జారుకున్నాయి. డిసెంబర్లో నమోదైన 4.1 శాతంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్యకాలానికిగాను కీలక రంగాలు 11.6 శాతం వృద్ధిని కనబరిచాయి.